– ముగ్గురు మృతి పలువురికి గాయాలు
– గుండీచా దేవాలయం వెలుపల ఘటన
– రథయాత్ర నిర్వహణలో బీజేపీ సర్కార్ వైఫల్యం
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో మరోమారు విషాదం చోటుచేసుకుంది. పూరీ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం గుండీచా దేవాలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 50 మంది పైగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్హీ వ్యక్తిగతంగా, ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పారు. భద్రతా ఏర్పాట్లలో జరిగిన వైఫల్యాలపై విచారణకు ఆదేశించారు. పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్ ఎస్ స్వియాన్, పోలీస్ సూపరింటెండెంట్ బినిత్ అగర్వాల్ను బదిలీ చేశారు. పూరీ సీడీపీ విష్ణు చరణ్ పాటి, పోలీస్ కమాండెంట్ అజరు పథిని సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. కాగా తొక్కిసలాటలో మరణించిన వారిని బసంతి సాహు (బోలాగర్హ్), ప్రేమకాంత్ మొహంతి, ప్రవతి దాస్ (బాలిపట్న)గా గుర్తించారు. రథయాత్ర నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. వీవీఐపీలకు ప్రోటోకాల్ కల్పించడంలోనే అధికార యంత్రాంగమంతా మునిగితేలిందని బాధితుల బంధువులు తప్పుబట్టారు. ప్రోటోకాల్ ఆంక్షలే తమవాళ్ల ప్రాణాలు తోడేశాయని వాపోయారు. పోలీసులంతా వీవీఐపీల భద్రతకు వెళ్లిపోయారని, జనాలను నియంత్రించేందుకు ఎవ్వరూ లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని వారు పేర్కొన్నారు. రద్దీ నేపథ్యంలో శనివారం రాత్రి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత భక్తులను ఒక్కసారిగా లోపలికి అనుమతించడంతో తొక్కిసలాట జరిగింది. దీనికితోడు రథాలను దగ్గర దగ్గరగా ఉంచడంతో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం రాత్రి పోలీసుల జాడే కన్పించలేదని, దీంతో ప్రజలను అదుపు చేయడం సాధ్యపడలేదని మృతుల బంధువులు పేర్కొన్నారు. కాగా పలువురు బీజేపీ మంత్రులు తమ బంధువులు, స్నేహితులను రథాల చెంతకు తీసుకుపోవడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. రథయాత్రలో ఈ నెల 27న కూడా తొక్కిసలాట లాంటి పరిస్థితులు, భారీ ఉష్ణోగ్రతల కారణంగా 600 మంది పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలైన సంగతి విదితమే. రాష్ట్రంలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం ఒడిశా ప్రజలు ఎంతో ఆరాధించే జగన్నాథ రథయాత్రను కూడా సరిగా నిర్వహించలేకపోవడం దారుణమని మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విమర్శించారు. భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. మృతులకు తీవ్ర సంతాపం ప్రకటించారు. వారి బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా ఘటనకు బాధ్యులంటూ కలెక్టర్, ఎస్పీ, ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. బీజేపీ మంత్రుల బంధువులే కారణంకాగా..వారిని వదిలి తమ అధికారులపై చర్య తీసుకోవటంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
పూరీలో తొక్కిసలాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES