నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో వర్క్షాప్ ఎక్స్పో శనివారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు కె రాజేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్షాప్నకు వందకుపైగా క్రియాశీలకమైన ప్రాజెక్టు మోడల్స్ను ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ ఎల్ శివరామకృష్ణ మాట్లాడుతూ ఇంజినీరింగ్ అంటే పుస్తకాల చదువుతో ముగిసిపోయేది కాదని అన్నారు. ఆలోచనలను, ఆవిష్కరణ సామర్థ్యాన్ని సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చే విధంగా ఉండాలని చెప్పారు. రోజువారీ జీవితాల్లో ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం నుంచి పరిశ్రమలు, ఆరోగ్యరంగం, వ్యవసాయం, రవాణా, ఇంధన, సమాచార సాంకేతికత వంటి అనేక రంగాల్లో అమలవుతున్న పరిష్కార మార్గాలే ఇంజినీరింగ్ అప్లికేషన్లని అన్నారు. ఇంజినీరింగ్ అనేది సమస్య పరిష్కార శాస్త్రమని వివరించారు. కనుగొంటున్న ప్రతి చిన్న ఆవిష్కరణ, మోడల్ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో ఉండాలని సూచించారు. దేశంలో యువ ఇంజినీర్లకు అవపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ వంటి కార్యక్రమాల్లో యువ ఇంజినీర్లు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు.
సివి రామన్, మేడం క్యూరీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాల్లో రోబోటిక్ టెక్నాలజీ, సెక్యూరిటీ డిటెక్షర్స్, రీఛార్జిబుల్ మిషన్స్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ కార్, డ్రోన్ టెక్నాలజీ, త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ వంటివి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ కె కృష్ణారావు, యాజమాన్య సభ్యులు టి రాకేశ్రెడ్డి, ఆర్ ప్రదీప్రెడ్డి, డైరెక్టర్లు వి అనురాధ, సత్యప్రసాద్ లంక, ప్రిన్సిపాల్ బిఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు.