Sunday, June 8, 2025
E-PAPER
Homeజాతీయంస్టార్‌లింక్‌ ప్రవేశాన్ని వ్యతిరేకించాలి

స్టార్‌లింక్‌ ప్రవేశాన్ని వ్యతిరేకించాలి

- Advertisement -

– అనుమతి ప్రక్రియలో ఎలాంటి పారదర్శకతా లేదు
– దేశ ప్రయోజనాలకు హానికరం
– ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలి
– భారత ప్రభుత్వానికి సీపీఐ(ఎం) డిమాండ్‌
న్యూఢిల్లీ :
భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించేదుకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు భారత ప్రభుత్వం అనుమతినివ్వడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ”మన దేశంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు స్టార్‌లింక్‌కు అనుమతి లభించిన మొత్తం ప్రక్రియకు సంబంధించి ఎలాంటి పారదర్శకతా లేదు. స్టార్‌లింక్‌ విదేశీ కార్పొరేషన్‌. భారత్‌కు చెందిన కీలకమైన మౌలిక సదుపాయాల వ్యవస్థను విదేశీ చేతులకు అప్పగించడంలో తీవ్రమైన భద్రతా పర్యవసానాలు ఇమిడివున్నాయి. మన టెలికం వ్యవస్థలోకి, చివరకు మన వ్యూహాత్మక కమ్యూనికేషన్లలోకి అమెరికా సంస్థలు ప్రవేశించడానికి దొడ్డిదారిని ఇది అందజేస్తోంది. శాటిలైట్‌ స్పాట్‌ నెంబర్లను, ముఖ్యంగా లో ఎర్త్‌ ఆర్బిట్‌ (దిగువ భూకక్ష్య) స్పాట్‌లను ఒకసారి స్టార్‌లింక్‌కు కేటాయిస్తే ఇక అవి మనం వెనక్కి తీసుకోలేం. మన దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి అసలే అరకొరగా ఉన్న మన రోదసీ వనరులను విదేశీ సంస్థలకు కట్టబెట్టడమే ఇది” అని పొలిట్‌బ్యూరో తీవ్రంగా విమర్శించింది.
మన దేశ స్వావలంబన సామర్ధ్యాలను అభివృద్ధిపరచడంలో ప్రభుత్వానికి నిజంగా ఆసక్తి ఉంటే.. ఇస్రో సేవలను ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నది. భారత్‌, ముఖ్యంగా డీఓటీ, సీ-డీఓటీలు శాట్‌కామ్‌ రంగానికి అవసరమైన పరికరాలను అందజేయగల సామర్ధ్యాలను కలిగివున్నాయని వివరించింది. ఈ చర్యలు భారత ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తాయనీ, మన భద్రతను, డిజిటల్‌ సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తాయని పేర్కొన్నది. ”మొత్తం ఒప్పందం ప్రక్రియ అంతా మిస్టరీగా ఉన్నది. ట్రారు కేవలం నాలుగు శాతమే స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీలు వసూలు చేస్తోంది. అంతకుమించి ఎలాంటి ముందస్తు రుసుములూ వసూలు చేయదు. దీనితో మన ఖజనాకు భారీగా నష్టాలు వస్తున్నాయి. మన ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. భారత రోదసీ నియంత్రణ సంస్థ ఇన్‌-స్పేస్‌ నుంచి కూడా వివరాలు, ఇతర పరిస్థితి గురించి ఎలాంటి సమాచారమూ వెల్లడి కాలేదు” పొలిట్‌బ్యూరో పేర్కొన్నది.
”స్టార్‌లింక్‌ ప్రవేశం, అంబానీ రిలయన్స్‌ జియోతో, మిట్టల్‌ భారతి ఎయిర్‌టెల్‌తో దాని భాగస్వామ్యం కలిసి ఒక వర్చువల్‌ డ్యూపోలీ (సాంకేతికంగా చూస్తే రెండు కంపెనీలు స్వతంత్రమైనవే అయినప్పటికీ అవి ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయి ఒకే సంస్థ నియంత్రణలో ఉంటూ సమర్థవంతంగా పనిచేసే మార్కెట్‌ పరిస్థితి)ని సృష్టించబోతున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థకు దీంతో పోటీ పడడం చాలా కష్టం కాగలదు. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలకూ చౌకగా టెలికం, ఇంటర్నెట్‌ సేవలను అందిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ను పూర్తిగా నాశనం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న మరో ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. స్టార్‌లింక్‌ కార్యకలాపాలను అనుమతించడం వల్ల దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలకు హానికరమవుతుంది. అందువల్ల తక్షణమే ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తోంది” అని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -