నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల 42శాతం బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు బీసీ సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈనెల 14న రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించనున్నట్టు ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రకటించగా, 13న జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైకోర్టు నిర్ణయంపై బీసీ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో 22 బీసీ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆర్. కృష్ణయ్య ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇవ్వడం దారుణమని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల సాధన ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా మారిందని, మిలియన్ మార్చ్ తరహాలో శాంతియుతంగా ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.