– ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈనెల 30న సమావేశం
– రాహుల్తో కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
– త్వరలో క్యాబినెట్ విస్తరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశాం : మహేశ్ కుమార్ గౌడ్
– ఒకట్రెండు రోజుల్లో కొత్త కార్యవర్గం ప్రకటన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్ర మంత్రివర్గం విస్తరణకు ముహూర్తం మరోసారి వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశాన్ని ఈనెల 30కి వాయిదా వేశారు. ప్రస్తుతం ప్రకృతి వైద్యం తీసుకుంటున్న ఖర్గే షెడ్యూల్ ప్రకారం సోమవారమే ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా వైద్యుల సూచనల మేరకు ఆయన చికిత్స మరో రెండ్రోజులు కొనసాగనున్నట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈనెల 30న ఖర్గే ఢిల్లీకి చేరుకోనున్నారు. దీంతో రెండ్రోజుల ఎదురుచూపుల తర్వాత సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్కు వెనుదిరిగారు. సోమవారం సాయంత్రం అక్బర్ రోడ్లోని10 జన్పథ్లో రాహుల్ గాంధీతో పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత కేసీ వేణుగోపాల్ కేరళలోని నీలంబూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ అభ్యర్థి ప్రకటనపై చర్చించారు. తెలంగాణ మంత్రివర్గ కూర్పుతో పాటు, పీసీసీ నూతన కార్యవర్గం అంశాలను రాహుల్కు వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఐదు మంత్రి పదవులకు సంబంధించి ఏడుగురి పేర్లు చర్చలో ఉన్నట్టు తెలిసింది. అలాగే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, తక్కువ సంఖ్యతో కూడిన పీసీసీ కార్యవర్గ జాబితాను సమర్పించారు. అనంతరం పీసీసీ చీఫ్ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిశారు. తర్వాత మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్యాబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, కవిత లేఖ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సాధ్యమైనంత త్వరగా క్యాబినెట్ విస్తరణ చేపట్టాలని, అందులో బీసీలకు రెండు పదవులు ఇవ్వాలని రాహుల్ని మహేశ్ కుమార్ గౌడ్ కోరినట్టు తెలిసింది. కార్యవర్గంలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.
క్యాబినెట్ విస్తరణ త్వరగా చేపట్టండి : పీసీసీ చీఫ్
వీలైనంత త్వరగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని రాహుల్ గాంధీని కోరినట్టు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. రాహుల్తో భేటీ అనంతరం 10 జనపథ్ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించినట్టు తెలిపారు. ఒకటి, రెండ్రోజుల్లో పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుంది’ అని అన్నారు.
సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ
రాహుల్తో భేటీ అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేరుగా తుగ్లక్ రోడ్ 23లోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు సీఎంతో చర్చించారు. రాహుల్తో భేటీ సందర్భంగా జరిగిన అంశాలను వివరించారు. ప్రస్తుతం ఖర్గే అందుబాటులో లేనందున ఈ నెల 30న సమావేశాన్ని వాయిదా వేసిన విషయాన్ని వివరించారు. అయితే… ఇప్పటికే రెండ్రోజులు వేచి చూసిన నేపథ్యంలో… మరో రెండు రోజులు పాటు ఢిల్లీలో ఉండేందుకు సీఎం విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాత్రి 8 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి బయలుదేరారు. సోమవారం మధ్యాహ్నం మరోసారి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైనట్టు తెలిసింది. దాదాపు గంటపాటు చర్చ జరిగినట్లు ఢిల్లీలో ప్రచారం సాగింది. అయితే ఈ భేటీని సీఎంవో, పార్టీ వర్గాలు ధవీకరించలేదు.