నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల ఢిల్లీలో కుక్కకాటు కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కలను వెంటనే పట్టుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తక్షణమే వీధి కుక్కలను పట్టుకోవాలని.. శాశ్వతంగా షెల్టర్లకు తరలించాలని సూచించింది. ఈ ప్రక్రియకు ఆటంకం కలిగించే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. 6 వారాల్లోపు వీధి కుక్కలన్నింటినీ పట్టుకోవాలని తెలిపింది. అన్ని కుక్కలను క్రిమిరహితం చేసి శాశ్వతంగా ఆశ్రయాలకు తరలించాలని ఉత్తర్వులో న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లలో పట్టుకున్న కుక్కల రికార్డులను భద్రపరచాలని.. ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని.. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం హెచ్చరించింది. అలాగే కుక్క కాటు, రాబిస్ కోసం ఒక వారంలోపు హెల్ప్లైన్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.