Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాలో కల్తీ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

జిల్లాలో కల్తీ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లాలో కల్తీ ఎరువులు, నకిలీ విత్తనాలు అమ్మిన, అధిక ధరలకు విక్రయించిన  కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ అనుసంధానంతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని ఎరువుల డీలర్స్ , విత్తన డీలర్స్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారులు, తో ఆయిల్ ఫామ్ సాగుపై రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిసి,  మాట్లాడారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాన కాలం సీజన్   ప్రారంభమవుతున్నందున  అందుకు అనుకూలంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఫర్టీలైజర్  షాపుల యాజమానులు షాపులలో  లైసెన్స్, స్టాక్ రిజిస్టర్, బిల్ రిజిస్టర్, యూరియా, డి ఏ పి, తదితర పురుగుల మందులు  స్టాకులను సీడ్స్ డీలర్స్ పక్కాగా మెయింటైన్ చేయాలన్నారు.

లేని పక్షంలో సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధరల పట్టిక, విత్తన ప్యాకెట్ల వంటి స్టాక్ వివరాలు, షాపుల ముందు బోర్డుల పై ఉంచాలన్నారు. మండల, గ్రామస్థాయిలలో ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం నిఘా, తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే  వారిపై సంబంధిత మండల  వ్యవసాయ అధికారికి తెలియజేసి అట్టి వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఎరువులు ,విత్తనాలు బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . మండల స్థాయిలో వ్యవసాయ  అధికారులతో ఎప్పటికప్పుడు రైతులతో  సమన్వయం చేసుకుంటూ విత్తనాల కొరత లేకుండా చూడాలన్నారు.

జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేదని అన్ని సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించడం  జరుగుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న నకిలీ విత్తనాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ  చర్యలు చేపట్టాలన్నారు. విత్తనాలు ఎరువులు స్టాక్ లేదన్న మాట జిల్లాలో ఎక్కడ కూడా రాకుడదన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం విత్తనాలు,  ఎరువులు  అధిక మోతాదులో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రభుత్వంచే గుర్తించబడిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని, విక్రయ సమయంలో సంబంధిత కంపెనీ పేరుతో రసీదు తప్పనిసరిగా కొనుగోలుదారుకు అందించాలని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయిస్తే షాపు లైసెన్స్ లను రద్దుచేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. దుకాణంలో నిల్వల వివరాలను ప్రతిరోజు వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని సత్యసాయి ఫర్టిలైజర్స్ షాపును తనిఖీ చేసి రైతులకు విక్రయిస్తున్న కంపెనీ విత్తనాల వివరాలు తెలుసుకున్నారు. రైతుల కోరిక మేరకు అన్ని కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉంచాలని, విత్తన విక్రయ సమయంలో కొనుగోలుదారుకు తప్పనిసరిగా రసీదు అందించాలని, నకిలీ, నిషేధిత విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు విత్తన ప్యాకెట్లను భద్రపరచుకోవాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే విత్తనాలను విక్రయించాలని, జిల్లాలో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉండేలా, ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. 

వంట నూనెల కొరత అధిగమించేందుకు  భవిష్యత్తు అవసరాలకు  అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే  ఆయిల్ పామ్ సాగును ప్రోత్సాహించడానికి  సబ్సిడీపై మొక్కలు, ఎరువులు, డ్రిప్ ను అందిస్తున్నది. ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించుట కొరకు ఎకరానికి రూ.50,918/- వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మొక్కలు మరియు డ్రిప్ ఇరిగేషన్ మరియు మొదటి నాలుగు సంవత్సరాల పాటు తోటల యాజమాన్యం మరియు అంతరపంటల సాగు కొరకు ఈ రాయితీ వర్తిస్తుందన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆయిల్ పామ్ విస్తరణ  పథకం క్రింద  3500 ఎకరాలు భౌతిక లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్యాన్ని చేరుకోడానికి ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ మరియు టి జి ఆయిల్ ఫెడ్ అధికారులు సమన్వయం తో పని చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట కు ఉన్న   ప్రయోజనాలను   దృష్టిలో  ఉంచుకుని  పెద్ద ఎత్తున రైతులు ఆయిల్ పామ్ సాగు ను చేపట్టి  ప్రభుత్వం కల్పిస్తున్న   రాయితీ లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు . కావున  భూమి, నీటి వసతి, కరెంట్ సదుపాయం  కలిగిన ప్రతి రైతు ఆయిల్ పామ్ ను సాగు చేసుకోడానికి ముందుకు వచ్చి ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చు కొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవాల్సిందిగా కోరారు. వ్యవసాయ, ఉద్యాన, టి జి ఆయిల్ ఫెడ్ అధికారులు సమన్వయం తో గ్రామ , మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి రైతులకు ఆయిల్ పామ్ పంట పై అవగాహన కల్పించాలన్నారు . అలాగే వారికి కేటాయించిన  లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని  ఆదేశించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్  వీరారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలు తమ ఎరువులను అధిక ధరలకు ఇక్కడ కూడా విక్రయించారు విక్రయిస్తే  అట్టి వారిపై వీడి యాక్ట్ కింద కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.  డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులు సర్టిఫైడ్ అయిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసుకోవాలన్నారు. నిషేధితమైన విత్తనాలు కూడా విక్రయిస్తే చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం  ఈ-పాస్ మిషన్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డీలర్లకు అందజేశారు. తదుపరి ఆయిల్ ఫామ్ సాగు అనే పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్,ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి,ఎ డి ఎ నీలిమ, మండల వ్యవసాయ అధికారులు,డీలర్లులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -