మావోయిస్టులు వద్దు – ఆదివాసీల అభివృద్ధే ముద్దు
ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఎం.సోమేశ్వర్
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై ఎం.సోమేశ్వర్ ప్రజలకు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఎస్సై సోమవారం మండల పరిధిలోని బూసరాయి గ్రామంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇటీవలి కాలంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన వరుస ఎదురు కాల్పులు, అరెస్టులతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ (మావోయిస్టు) సాయుధ దళాలు తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి, ఆదివాసీ నివాస ప్రాంతాలను ఆధారంగా చేసుకొని,
సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. ముఖ్యంగా జిల్లాలోని అశ్వాపురం, మణుగూరు, ఏడూళ్ల బయ్యారం, కరకగూడెం, గుండాల, ఆళ్ళపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో గల అటవీ ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు పలు మార్గాల ద్వారా సమాచారం అందుతున్నదని తెలిపారు. సీపీఐ (మావోయిస్టు) సాయుధ దళాలు, దళ సభ్యులు లేదా అనుమానితులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా మీ ఆదివాసీ గూడాల దగ్గరలో సంచరిస్తున్నట్లయితే వెంటనే పోలీసు నెంబర్ డయల్-100 కు ఫోన్ చేసి, అట్టి సమాచారం ఇచ్చి, తగిన పారితోషకం పొందాలని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని వెల్లడించారు. ఎట్టి
పరిస్థితులలోను సమాచారం ఇచ్చిన వారి పేరు బయటికి చెప్పబడదని హామీ ఇచ్చారు. సాయుధ దళాలకు, దళ సభ్యులకు కిరాణా సామాగ్రి, తినే పదార్థాలు, డబ్బులు, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులు సరఫరా చేసి సహకరించొద్దని తెలిపారు. ఆ చర్యల్లో భాగంగానే మావోయిస్టులకు సహకరించిన వారికి ప్రభుత్వం నుండి లభిస్తున్న పథకాలను, సదుపాయాలను నిలిపి వేయబడతాయన్నారు. అదేవిధంగా మావోయిస్టు దళ సభ్యులకు సహకరించిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను తెలంగాణ ప్రాంతం నుండి వారి స్వంత ఊర్లకు పంపించబడతారని హెచ్చరించారు. ” ‘పోలీసులకు సహకరించండి – తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుకావాలి’, ‘మావోయిస్టులు వద్దు – ఆదివాసీల అభివృద్ధే ముద్దు’ ” అని నినదించారు. ఎస్సై వెంట కానిస్టేబుల్ కె.ఉపేందర్, టీ.ఎస్.ఎస్.పీ సిబ్బంది ఉన్నారు.