నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలు జరపాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. పరీక్షలు సకాలంలో జరగకపోవడం వల్ల చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. పీజీసెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలతో పాటు ఇతర పోటీ పరీక్షలు రాసేందుకు వారు అర్హత కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత కీలకమైన విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పరీక్షలను సకాలంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ వైఖరితో విద్యార్థులకు తీవ్ర నష్టం: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES