నవతెలంగాణ-హైదరాబాద్: రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. భారత్ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్రను ప్రధాని మోడీ ప్రకటించారు. దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాని మోడి న్యూఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ …. వచ్చే పదేళ్లలో దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేయనున్న మిషన్ సుదర్శన్ చక్ర వ్యవస్థ కీలక ప్రదేశాలను కాపాడనుందన్నారు. ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారని ప్రధాని భరోసా ఇచ్చారు.
మహాభారతంలోని శ్రీ కృష్ణుడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో దేశంలోని కీలకమైన మౌలిక వసతులను ముప్పు నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సాంకేతికత అభివృద్ధి విదేశాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తోందన్నారు. 2008 ముంబయి దాడులు సమీకృత భద్రతా ప్రణాళిక అవసరాలను పెంచాయన్నారు. దేశంపై దాడులు జరిగినప్పుడు మాత్రమే స్పందించేలా కాకుండా.. ముందే సంసిద్ధతతో ఉండాలన్నారు. పదేళ్ల క్రితం రక్షణరంగంలో స్వయంసమృద్ధిపై మన దేశం దృష్టిపెట్టిందని.. ఇప్పుడు దాని ఫలితాలను చూస్తోందని ప్రధాని మోడీ తెలిపారు.
ప్రధాని ప్రసంగంలోకి కీలక అంశాలు….
”దేశంలో హైపవర్డ్ డెమోగ్రఫీ మిషిన్ను అమలుచేయనున్నాం. దేశంలో అవకాశాలు చొరబాటుదారులు లాక్కోకుండా చూడటమే దీని లక్ష్యం. ముఖ్యంగా ఆదివాసీల భూములను చొరబాటుదారులు లక్ష్యంగా చేసుకొంటున్నారు. ఇకపై వారి ఆటలు సాగనీయం”
”రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 ఏళ్లుగా దేశానికి సేవ చేస్తోంది. వారి అంకితభావానికి నా సెల్యూట్”
”తూర్పు భారత్లో ప్రదేశాలను దేశంలోని మిగిలిన భాగాలతో సమానంగా అభివృద్ధి చేస్తాం”
”మన రైతులకు వ్యతిరేకంగా ఉండే ఎలాంటి విధానాలకైనా నేను ఓ గోడలా అడ్డం పడతాను”
”ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ప్రైవేటు రంగంలో మొదటి ఉద్యోగం తెచ్చుకొన్నవారికి రూ.15,000 అందజేస్తాం”
”మన వ్యాపారులు దేశీయ ఉత్పత్తులను బోర్డులపై రాసి ప్రదర్శించాలని కోరుకుంటున్నాను”
”సముద్రంలో సహజవనరులు, గ్యాస్, చమురు అన్వేషణకు వీలుగా నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషిన్ ప్రారంభించనున్నాం”
”శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర దేశానికి గర్వకారణం. గగన్యాన్ మిషిన్ కోసం భారత్ వేగంగా సిద్ధం అవుతోంది. భవిష్యత్తులో సొంతంగా స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటుచేసేందుకు ప్లాన్ చేస్తోంది”