నవతెలంగాణ-హైదరాబాద్: వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 20న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం అవసరమా కాదా అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.జి.మసిహ్లతో కూడిన ధర్మాసనం పరిశీలించనుంది. అప్పటివరకు, కేంద్ర ప్రభుత్వం చట్టంలోని నిబంధనలు అమలు చేయదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇచ్చిన హామీ కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది.
ఈ పిటిషన్ల విచారణ నుండి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13న తాను పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ అంశంపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయాలనుకోవడం లేదని లేదా రిజర్వ్ చేయాలని కూడా అనుకోవడం లేదని మే 5న విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని సవలు చేస్తున్న పిటిషన్లపై తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బి.ఆర్.గవారు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతుందని అన్నారు. విచారణను నేటికి వాయిదే వేశారు.