నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్షా కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పకపోవడంపై ఆయనను సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా మందలించింది. మంత్రి అభిప్రాయం, విశ్వసనీయతను అనుమానించేలా ఆయన ప్రవర్తన ఉందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఆగస్టు 13లోగా నివేదికను సమర్పించాల్సిందిగా మంత్రి వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్)ను ఆదేశించింది. సిట్ 87మందిని విచారించిందని, ప్రస్తుతం వారి వాంగ్మూలాలను పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు గుర్తించింది.
విజయ్షా మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేత జయఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే గత సంఘటనల గురించి రిట్ పిటిషన్లో చేసిన కొన్ని ఆరోపణలను సిట్ పరిశీలిస్తోందని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్ట్ 18కి వాయిదా వేసింది.
అయితే మంత్రి ఆన్లైన్లో బహిరంగ క్షమాపణలు తెలిపారని, కోర్టు రికార్డుల్లో చేర్చాల్సి వుందని షా తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కె.పరమేశ్వర్ కోర్టుకు తెలిపారు.