నవతెలంగాణ-హైదరాబాద్: 8వ తరగతి సోషల్ టెక్ట్స్బుక్లో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అధ్యాయాన్ని చేర్చినందుకు విద్యాశాఖ కార్యదర్శి, ఎన్సీఇఆర్టీ( NCERT) డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీకి సుప్రీంకోర్టు గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారం లేదా ఇతర చట్టాల కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని నోటీసుల్లో పేర్కొంది. ఎన్సీఇఆర్టీ(NCERT) 8వ తరగతి సోషల్ టెక్ట్స్బుక్లో ముద్రించిన వివాదాస్పద అధ్యాయాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. అభివృద్ధి బృందంలోని సభ్యులందరి పేర్లు, అర్హతలు, యోగ్యతా పత్రాలు సహా అధ్యాయాన్ని ఆమోదించిన టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్స్ కమిటీ వివరణాత్మక రికార్డులను సమర్పించాలని ఎన్సిఇఆర్టిని ఆదేశించింది.‘వారు తుపాకీ పేల్చారు.. న్యాయవ్యవస్థ నేడు రక్తసిక్తమవుతోంది” అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఎన్సిఇఆర్టి టెక్స్ట్ బుక్స్పై, డిజిటల్ విభాగంపై కూడా పూర్తి నిషేధం విధించింది. ఎన్సీఇఆర్టీ క్షమాపణలు చెప్పినప్పటికీ.. సుమోటోగా విచారణను నిలిపివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. పాఠ్యపుస్తకాలు, డిజిటల్ విభాగంపై కూడా పూర్తి నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్తర్వులను మీరిన ఏ చర్య అయినా న్యాయపరిపాలనలో ప్రత్యక్ష జోక్యంగా పరిగణించబడుతుందని, కోర్టు ధిక్కారానికి దారితీస్తుందని హెచ్చరించింది.



