నవతెలంగాణ-హైదరాబాద్: కోర్టుల్లో టాయిలెట్స్ (మరుగుదొడ్లు) కొరతపై నివేదికలు దాఖలు చేయకపోవడంతో 20హైకోర్టులకు సుప్రీంకోర్టు బుధవారం చీవాట్లు పెట్టింది. ఎనిమిది వారాల్లోగా నివేదికలు సమర్పించాలని గడువు విధించింది. చాలా హైకోర్టులు ఇప్పటికీ తమ అఫిడవిట్లు/సమ్మతి నివేదికలు దాఖలు చేయలేదని, ఇది వాటికి చివరి అవకాశమని జస్టిస్ జె.బి.పార్దివాలా, ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. గడువులోపల నివేదికలు దాఖలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది. ఆదేశాలను పాటించడంలో విఫలమైతే.. హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్లు వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాల్సి వుంటుందని స్పష్టం చేసింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్, కోల్కత్తా, ఢిల్లీ, పాట్నా హైకోర్టులు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే దేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సరైన పారిశుధ్యం ప్రాథమిక హక్కుగా గుర్తించబడిందని ఈ ఏడాది జనవరి 15న కోర్టు తీర్పునిచ్చింది. అన్ని కోర్టు ప్రాంగణాలు మరియు ట్రిబ్యునల్స్లో పురుషులు, మహిళలు, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేక టాయిలెట్ సౌకర్యాల లభ్యత ఉండేలా చూడాలని హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. టాయిలెట్స్ లభ్యతపై నాలుగు నెలల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా కోరింది. న్యాయవాది రాజీవ్ కలిత దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది.