నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో అతను పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నప్పటికీ, బ్యాటింగ్ జాబితాలో నంబర్ వన్ ర్యాంక్ను కాపాడుకోవడం విశేషం. ప్రపంచకప్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఇషాన్ కిషన్ ఏకంగా 17 స్థానాలు మెరుగుపరుచుకుని 8వ ర్యాంకును దక్కించుకున్నాడు. కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకోవడం అతనికి కలిసొచ్చింది. శ్రీలంక ఆటగాడు పతుమ్ నిస్సంక మూడో స్థానానికి చేరుకున్నాడు.
ఆల్ రౌండర్ల జాబితాలో పాకిస్థాన్కు చెందిన సైమ్ అయూబ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. భారత్పై మూడు వికెట్ల ప్రదర్శనతో, జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజాను వెనక్కి నెట్టి నంబర్ వన్ అయ్యాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక స్థానం ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. దీంతో అగ్రస్థానంలో ఉన్న భారత బౌలర్ వరుణ్ చక్రవర్తికి అతను మరింత చేరువయ్యాడు. భారత బౌలర్లు అక్షర్ పటేల్ (14వ ర్యాంక్), జస్ప్రీత్ బుమ్రా (15వ ర్యాంక్) కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.



