– కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం
– హాజరైన అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, తెలంగాణ,
– హిమాచల్ ప్రదేశ్ సీఎంలు రేవంత్, సుఖ్విందర్ సింగ్
– మూడు అంశాలపై తీర్మానాలు
– కులగణనపై సీఎం రేవంత్రెడ్డి ప్రజెంటేషన్
– సీడబ్ల్యూసీ అభినందనలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా చేపట్టబోయే కులగణనలో తెలంగాణను కేంద్ర ప్రభుత్వం మోడల్గా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఏకగ్రీవ తీర్మానం చేసింది. శుక్రవారం నాడిక్కడ అక్బర్ రోడ్లోని ఏఐసీసీ ఓల్డ్ ఆఫీస్లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీలో సభ్యులుగా ఉన్న మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్. రఘువీరారెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ సుమారు రెండు గంటల వరకు సాగింది. ఈ భేటీలో… పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ బలమైన రిప్లై ఇవ్వడం, ఓబీసీ కులగణన, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం క్యాప్ను ఎత్తి వేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ దిశలో పలు తీర్మానాలు చేశారు. టెర్రరిస్ట్లకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్పై కేంద్రం ఏ చర్య తీసుకున్నా ..అందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని సీడబ్ల్యూసీలో తీర్మానం చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన కుల గణనను కేంద్రం పరిగణనలోకి తీసుకొని… దేశ వ్యాప్త కులగణన చేపట్టాలని మరో తీర్మానం చేశారు. వీటితో పాటు రిజర్వేషన్లపై ఉన్న క్యాప్ను 50 శాతానికి పరిమితం చేయకుండా, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు.
కులగణనపై ప్రధానచర్చ..
కుల గణనపై ప్రధానంగా చర్చించినట్టు సీడబ్ల్యూసీ మీటింగ్లో పాల్గొన్న నేతలు మీడియాకు తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కులగణన జరగాలనే డిమాండ్ ను కేంద్రం ముందు పెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కులగణన మోడల్ను పరిగణనలోకి తీసుకోవాలని తీర్మానం చేసినట్టు చెప్పారు. కేవలం కులగణనపై కేంద్రం ఫోకస్ పెట్టకుండా… తెలంగాణ ఫార్మాట్ లో ఆర్థికం, రాజకీయం, సామాజిక, విద్య తదితర అన్ని అంశాలపై సమగ్ర సర్వే చేయాలన్నారు. పుల్వామా ఘటనపై కూలంకషంగా చర్చించినట్టు చెప్పారు. ఇన్నిరోజులు అయినప్పటికీ ఉగ్రవాదులకు అండగా నిలుస్తోన్న పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ ఉగ్రదాడిపై నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్కు ప్రధాని రాకుండా అమిత్ షాను సమావేశానికి పంపడాన్ని కాంగ్రెస్ ఖండిస్తుందని స్పష్టం చేశారు. ప్రధానికి దేశ భద్రత కంటే ముఖ్యమైన సమావేశం ఇంకేముందో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చ జరిగిందని వెల్లడించారు.
కుల గణనపై సీఎం రేవంత్ ప్రజెంటేషన్ : ప్రశంసించిన సీడబ్ల్యూసీ
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కుల గణనలో అవలంబించిన విధానాన్ని పార్టీ అగ్రనేతలు, సీడబ్ల్యూసీ నేతలకు వివరించారు. పౌర సమాజం, మేధా వులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సామాజిక వర్గాల లీడర్లను ప్రక్రియ లో భాగస్వాముల్ని చేసినట్టు చెప్పారు. ఫైనల్గా వివిధ రాష్ట్రాలు అను సరించిన విధానాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం సుమారు 75 ప్రశ్నలతో ఫార్మాట్ కాపీని సభ్యులందరికీ అందజేశారు. అధికారులతో అంతర్గత కసరత్తు కాకుండా బహిరంగంగా ప్రజల నుంచి వివరాలు సేకరించామన్నారు. అలా కులగణన నమోదులో పారదర్శకత, ఆర్థిక, సామాజిక, విద్యా, రాజకీయ అంశాలను పొందుపరిచిన వివరాలను తెలిపారు. సర్వేను కచ్చితంగా అమలు చేయడానికి, లక్ష మందికి పైగా శిక్షణ పొందిన సిబ్బందిని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించా మన్నారు. మొత్తం 94,261 ఎన్యుమరేషన్ బ్లాక్ లుగా విభజించిందని, ప్రతి బ్లాక్కు సుమారు 150 గృహాలను కవర్ చేసేలా మార్క్ చేసి ప్రజల నుంచి సమాచారం సేకరించినట్టు తెలిపారు. 50 రోజుల్లో సర్వే పూర్త యిందని, పట్టణాలు విస్తరించడంతో పాటు వలసలు ఉండడంతో కొత్తగా ఎన్యుమరేషన్ బ్లాక్స్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వివరించారు. మొత్తం రెండు దశల్లో ఈ సర్వేను పూర్తి చేసి, పూర్తి వివరాలను డేటా రూపంలో రికార్డు చేసినట్టు వెల్లడించారు. అగ్రనేత రాహుల్ గాంధీ సూచనలు, సలహాలతో.. ఈ ఏడాది ఫిబ్రవరి 2న తెలంగాణ క్యాబినెట్ ఈ కుల గణనకు ఆమోదం తెలిపిందని, 16వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు చెప్పారు. అయితే… దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభు త్వం విజయవంతంగా చేపట్టిన కుల గణనను అగ్రనేతలు ప్రశంసించారు. పారదర్శకంగా… తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన పద్ధతిని ఫాలో కా వాలని తీర్మానం చేశారు. జాతీయ స్థాయిలో చేసే కులగణనలో తెలంగా ణ మోడల్ని కేంద్ర ప్రభుత్వం ఫాలో కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ కుల గణన సామాజిక విప్లవానికి నాంది: రేవంత్ ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. జన గణనలో కుల గణనకు తెలంగాణ మోడల్ ను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసినట్టు వెల్లడించారు. ‘నాలుగు గోడల మధ్య.. నలుగురి ఆలోచనలతో కాకుండా.. మొత్తం పౌర సమాజం మమేకమైందన్నారు. తెలంగాణ మేధావులతో సలహాలు, సూచనలు స్వీకరించి శాస్త్రీయంగా కులగణన చేపట్టాం. ఇది ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది. ఈ విషయంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలవడం గర్వంగా ఉంది. అత్యద్భుతంగా, అత్యంత పారదర్శకంగా కుల గణన నిర్వహించి తెలంగాణ ప్రతిష్టను దేశ స్థాయిలో చాటిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరొక్కసారి నా అభినందనలు.’ అని ట్వీట్ చేశారు.
కులగణనలో తెలంగాణను మోడల్గా తీసుకోండి
- Advertisement -
RELATED ARTICLES