నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జాతీయ విద్యా విధానం ముసుగులో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు ప్రభుత్వం మండిపడుతోంది. ఈ అంశంలో తమిళనాడు ప్రభుత్వం తాజాగా దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపివేసిందని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. పాఠశాల విద్య కోసం ఉద్దేశించిన సమగ్ర శిక్ష పథకం అవసరాలకు అనుగుణంగా తమిళనాడు ఉందని గతేడాది ఫిబ్రవరి 16న జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశంలో కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్లో ప్రస్తావించింది. ఆ తరువాత ఈ పథకం కింద ఖర్చు కోసం రూ.3,585.99 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందని పేర్కొంది. ఇందులో 60:40 నిష్పత్తి ప్రకారం, కేంద్రం వాటా రూ.2,151 కోట్లు అని తెలిపింది. ఈ నిధులు గత ఏడాది ఏప్రిల్ 1 నుంచే రాష్ట్రానికి చెల్లించాల్సి ఉందని పేర్కొంది. అయితే, జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని పిటిషన్లో వివరించింది.
జాతీయ విద్యా విధానంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -