నవతెలంగాణ-హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పుతో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి దిగివచ్చారు. తీర్పు వెల్లడించిన రెండు నెలల తర్వాత తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి మంగళవారం రెండు బిల్లులను ఆమోదించారు. గత నెల తమిళనాడు శాసన సభ ఈ బిల్లులను ఆమోదించింది. గవర్నర్ ఆమోదం సుప్రీంకోర్టు తీర్పు ఫలితమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ఆమోదం ఊహించనదేనని, తాము మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామేమోనని గవర్నర్ భయపడుతున్నారని అన్నారు. ఈ రెండు బిల్లులు తమిళనాడులోని పట్టణ మరియు స్థానిక సంస్థలకు వికలాంగుల నామినేషన్కు అవకాశం కల్పిస్తోంది. ఈ బిల్లులు 12,000మందికి పైగా వికలాంగులను ప్రభావితం చేయడమే కాకుండా వారికి సాధికారత కల్పిస్తాయి.
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
గవర్నర్ 10 బిల్లులను అడ్డుకోవడం చట్టవిరుద్ధం, ఏకపక్షం అని ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. బిల్లులను ఆమోదించడానికి కోర్టు తన ప్రత్యేక అధికారాలను వినియోగించింది. బిల్లులను అసెంబ్లీ రెండు సార్లు ఆమోదించిందని, గవర్నర్ వాటిని ఆమోదించి ఉండాల్సిందని జస్టిస్ జె.డి.పార్థివాలా మరియు జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆయన నిర్ణయాన్ని తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది. ”అసెంబ్లీలో ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ సమ్మతి కోసం పంపించగా ఆయన తిరస్కరించారు. దీంతో అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి పంపించారు. వాటిపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతికి నివేదించామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమే. అందుకే రెండోసారి పంపిన తేదీ నుంచే అవి గవర్నర్ సమ్మతి పొందినట్లు పరిగణిస్తున్నాం” అని ధర్మాసనం తీర్పు ప్రకటించింది.