నవతెలంగాణ – హైదరాబాద్: భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్-1బీ వీసాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా హెచ్-1బీ వీసాలపై ఎలాంటి నియామకాలు చేపట్టబోమని సంస్థ సీఈఓ కే కృతివాసన్ స్పష్టం చేశారు. దీనికి బదులుగా అమెరికాలోని స్థానిక ప్రతిభావంతులకే ఉద్యోగావకాశాలు కల్పించడంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కృతివాసన్ మాట్లాడుతూ… “అమెరికాలో మా కంపెనీలో మొత్తం 32 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 11 వేల మంది హెచ్-1బీ వీసాలపై వచ్చిన వారే ఉన్నారు. అయితే, భవిష్యత్తులో హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలని మేం భావిస్తున్నాం” అని వివరించారు. ఈ వ్యూహంలో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతామని ప్రతిపాదించడం టెక్ కంపెనీలలో తీవ్ర గందరగోళానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. దీర్ఘకాలికంగా విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా స్థానిక నైపుణ్యాలను ప్రోత్సహించే దిశగా కంపెనీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.