నవతెలంగాణ-హైదరాబాద్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షరిప్ ప్రభుత్వానికి భారీ షాకిచ్చింది. కనీసం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే ఆ దేశం నుంచి వెళ్లిపోయింది. పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ చీఫ్గా ఉన్న జావాద్ రెహ్మాన్ ఈ విషయాన్ని బయటపెట్టారు. దీనిని ‘‘ ఒక యుగం ముగింపు’’ అని అభివర్ణించారు.
25 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో డిజిటల్ వృద్ధిని రూపొందించడానికి మైక్రోసాఫ్ట్ మార్చి 7, 2000లో ఆ దేశంలోకి ప్రవేశించింది. మైక్రోసాఫ్ట్ తన నిష్క్రమణకు ఎలాంటి కారణాలు చెప్పనప్పటికీ, దేశ ఆర్థిక సంవత్సరం 2024 వాణిజ్య లోటు 24.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది, జూన్ 2025లో నిల్వలు కేవలం 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి, ఇది టెక్ దిగుమతులు, విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేసింది.
అంతేకాకుండా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాక్కు నైపుణ్య ఉద్యోగుల కొరత రోజురోజుకు పెరిగిపోతుంది. మరోవైపు అనిశ్చిత రాజకీయాలు, ఉగ్రవాదుల ప్రతికూల చర్యలు, ఆర్థిక గందరగోళం, పేలవమైన వాణిజ్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ దేశ పరిశీలకులు చెబుతున్నారు.