నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సేవలు, ధ్రువపత్రాల కోసం మీ-సేవ, ఇంటర్నెట్ కేంద్రాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, వాటన్నింటినీ అరచేతిలోని సెల్ఫోన్లోకి తీసుకొచ్చేందుకు ‘వాట్సాప్ చాట్బాట్’ విధానాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా 80969 58096 అనే వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఒక్క నంబర్తోనే రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ సేవలను పొందేలా ‘వన్ స్టాప్ షాప్’ తరహాలో దీనిని రూపొందించారు.
ప్రజలు ఈ వాట్సాప్ నంబర్కు ‘Hi’ అని మెసేజ్ పంపితే చాలు, వివిధ సేవలతో కూడిన ఒక మెనూ ప్రత్యక్షమవుతుంది. ప్రస్తుతం మీ-సేవ పోర్టల్లో లభించే కులం, ఆదాయం వంటి సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకోవడం, వాటి స్టేటస్ తెలుసుకోవడం, మున్సిపల్ పన్నులు చెల్లించడం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాల శాఖలకు సంబంధించిన కీలక సమాచారం కూడా పొందవచ్చు. ఇటీవల ఇంటర్, పదో తరగతి, ఇతర ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను కూడా ఇదే వాట్సాప్ ద్వారా అందించి ప్రభుత్వం విజయవంతంగా పరీక్షించింది.



