నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే వారికి నగదు బహుమతి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి రూ. 25,000 నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రహ వీర్’ పథకాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది.
ఈ మేరకు రవాణా శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అనేకమంది పోలీసు కేసుల భయంతో లేదా ఇతర కారణాలతో బాధితులకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని, ఈ ధోరణిని మార్చడానికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. బాధితులను ఆదుకున్న వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం కూడా అందించి గౌరవిస్తామని స్పష్టం చేశారు.
వైద్య నిపుణుల ప్రకారం ప్రమాదం జరిగిన మొదటి గంట సమయాన్ని ‘గోల్డెన్ అవర్’ అంటారు. ఈ సమయంలో క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, చాలా సందర్భాల్లో బాధితులు సకాలంలో ఆసుపత్రికి చేరకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయి. ప్రజల్లోని భయాలను, అపోహలను తొలగించి, సామాజిక బాధ్యతను ప్రోత్సహించేందుకే కేంద్రం ‘రహ వీర్’ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు తెలంగాణలో ఈ పథకం అమలులో లేదు. రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాల నేపథ్యంలో ఇప్పుడు ఈ పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని తాజాగా రవాణా శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రమాద సమయాల్లో మానవతా దృక్పథంతో స్పందించేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.



