Saturday, June 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ అన్‌ స్టాపబుల్‌…ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌

తెలంగాణ అన్‌ స్టాపబుల్‌…ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌

- Advertisement -

– రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రండి
– ప్రతి భాగస్వామ్యం లావాదేవీ కాదు… అది ఒక మార్పు : ‘గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌’లో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న నేపథ్యంలో తమ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో ‘ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కొలాబరేషన్‌(ఐబీసీ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌ – 2025’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదట్లో చాలా మంది తెలంగాణ అభివృద్ధి అసాధ్యమన్నారని గుర్తు చేశారు. కానీ.. అనతి కాలంలోనే రాష్ట్రం అన్‌ స్టాపబుల్‌ అనే స్థాయికి ఎదిగిందని వివరించారు. రాష్ట్ర జీడీపీ 16.12 లక్షల కోట్లకు చేరిందన్నారు. 10.1 శాతం వృద్ధి రేటుతో దేశ సగటు (9.9శాతం)ను దాటేసిందని తెలిపారు. తలసరి ఆదాయం 3.79 లక్షలుందనీ, ఇది దేశ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువని చెప్పారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సేకరించగలిగామని వివరించారు. గత 14 నెలల్లో లైఫ్‌ సైన్సెస్‌లో రూ.40వేల కోట్ల పెట్టుబడులను సాధించామని వివరించారు. రెండు లక్షల ఉద్యోగాలు సృష్టించామని తెలిపారు. రాష్ట్ర జీడీపీలో సేవల రంగం వాటా 66.3 శాతం కాగా, దేశంలో ఇది 55 శాతంగా ఉందన్నారు. ఇవి అంకెలు కాదనీ,… తెలంగాణ పురోగతికి నిదర్శనాలు’ అని స్పష్టం చేశారు. ‘ప్రతి భాగస్వామ్యం ఒక లావాదేవీ కాదు.. అది ఒక మార్పు అవుతుంది’అని చెప్పారు. అందుకే అంతర్జాతీయ భాగస్వామ్యాలతో తెలంగాణ పురోగతిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆగ్రో ఇన్నోవేషన్‌, ఏఐ గవర్నెన్స్‌, స్మార్ట్‌ హెల్త్‌ సిస్టమ్స్‌, డిజిటల్‌ ఫార్మింగ్‌, ఫ్యూచర్‌ – రెడీ ఎడ్యుకేషన్‌, సస్టైనబుల్‌ మానుఫ్యాక్చరింగ్‌, క్లీన్‌ ఎనర్జీ తదితర అంశాల్లో ప్రపంచ దేశాలతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేవలం పెట్టుబడులు పెట్టేందుకు మాత్రమే ఇక్కడకు రావొద్దు.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు కలిసి రావాలని ఆహ్వానించారు. ‘బ్రెజిల్‌, జర్మనీ, రష్యా, కామెరూన్‌, మాల్టా, యూకే, బల్గరేయా, బెల్జియం, యూఏఈ, దుబాయి తదితర 25 దేశాల ప్రతినిధులు ఒకే వేదిక పైకి రావడం శుభపరిణామన్నారు. ఇది ఒక సదస్సుగా మిగిలిపోకుండా వివిధ దేశాల మధ్య సంస్కృతి, వ్యూహాలు, టెక్నాలజీ బదలాయింపునకు వారధిగా నిలవాలని శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సహాకాలను ఆయా దేశాల్లోని పారిశ్రామికవేత్తలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ డిప్లోమేటిక్‌ రిలేషన్స్‌(ఐవోడీఆర్‌) మాల్టా గవర్నర్‌ లిల్లో మర్రా, కార్యదర్శి మార్సెల్లో పట్టి, బెల్జియం ఎంపీ ఇవాన్‌ పెట్రోవ్‌, జర్మనీ డిప్లోమాట్‌ డానియల్‌ జెర్బిన్‌, అర్జెంటీనా ఎంపీ క్లాడియో సింగోలనీ, ఐబీసీ చైర్మెన్‌ సాల్మన్‌ గట్టు, డైరెక్టర్‌ గ్లోరియా సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -