Wednesday, June 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుదేశంలోనే తెలంగాణ పోలీసులకు అగ్రస్థానం

దేశంలోనే తెలంగాణ పోలీసులకు అగ్రస్థానం

- Advertisement -

– ఫిర్యాదులకు న్యాయం చేయాలి
– గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి : రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌
– వికారాబాద్‌ జిల్లాలో పర్యటన
నవతెలంగాణ-వికారాబాద్‌

దేశంలోనే తెలంగాణ పోలీసులకు అగ్రస్థానం ఉందని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ అన్నారు. కేసుల్లో కన్విక్షన్‌ శాతాన్ని గణనీయంగా పెంచి, ఫిర్యాదులకు న్యాయం చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లాలో డీజీపీ పర్యటించారు. ముందుగా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం మల్టీ జోన్‌-2 ఐజీపీ వి.సత్యనారాయణ, చార్మినార్‌ జోన్‌ డీఐజీ తస్ఫీర్‌ ఇక్బాల్‌, జిల్లా ఎస్పీ కె.నారాయణరెడ్డి, జిల్లా అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్‌పెక్టర్లతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పలు కీలక ఆదేశాలు జారీ చేశామన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దొంగతనం కేసులను త్వరితగతిన ఛేదించాలన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. జిల్లాలో ఎన్‌డీపీఎస్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రాష్ట్రంలో లేకుండా నిర్మూలించాలన్నారు. సరిహద్దు పోలీస్‌ స్టేషన్ల అధికారులు మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిరంతరం దాడులు నిర్వహించి మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టాలని తెలిపారు. ప్రభుత్వ పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించి వ్యాపారం చేసే వారిని, ఇసుక మాఫియాను, మట్కా, గేమింగ్‌ వంటి జూదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని, రాత్రి వేళల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లాలోని హాట్‌ స్పాట్లను గుర్తించి ఆర్‌టీఏ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఇతర అధికారులతో కలసి రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలు చేపట్టాలన్నారు. పోలీసులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ స్నేహ పూర్వక వాతావరణం నెలకొల్పాలని సూచించారు. వికారాబాద్‌ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, ఫామ్‌హౌస్‌లు, వీకెండ్‌లలో జరిగే పార్టీలపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. శాంతిభద్రతలను కాపాడి, ప్రజలకు మరింత భద్రతను కల్పించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -