ఇప్పటికైనా చెరువుల్లో చేప పిల్లలు వదిలి ముదిరాజ్లకు ఉపాధి కల్పించాలి : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు
కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్, పండుగ సాయన్న ముదిరాజ్ విగ్రహాల ఆవిష్కరణ
నవతెలంగాణ-నంగునూరు
కమీషన్లతో జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల టెండర్లను పిలుస్తున్నదే తప్ప ప్రజల సంక్షేమ కోసం కాదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని విస్మరించి వారి జేబులు నింపుకోవడానికి మాత్రమే పని చేస్తోందని విమర్శించారు. సోమవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో శాసనమండలి వైస్ చైర్మెన్ బండ ప్రకాష్ ముదిరాజ్తో కలిసి కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్, పండుగ సాయన్న ముదిరాజ్ విగ్రహాల ఆవిష్కరణలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ సాయన్న, కొరివి కృష్ణస్వామి విగ్రహాలు పాలమాకుల గ్రామంలో ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువుల్లో నీళ్లు నింపి చేపల పెంపకానికి కృషి చేయడంతో ముదిరాజులకు ఉపాధి కల్పించామని చెప్పారు. కానీ ప్రస్తుతం ఏ గ్రామంలోకి వెళ్లినా చెరువులు ఎండిపోయి చేపలు చనిపోతున్నాయని వాపోయారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వానాకాలం రాకముందే టెండర్లను పిలిచి చేప పిల్లల పెంపకానికి సిద్ధపడే వాళ్ళమని, జూన్ నెల వచ్చినా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల టెండర్లు కూడా పిలవలేదని ఆరోపించారు. దీన్ని బట్టి ముదిరాజుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధమవుతున్నదన్నారు. కనీసం ఇప్పటికైనా బడ్జెట్ కేటాయించి అన్ని చెరువుల్లో, కుంటల్లో చేప పిల్లలు వదలాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీలుగ విత్తనాలివ్వడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలో రూ.పదివేల కోట్లతో, జీహెచ్ఎంసీ రూ.7,000 కోట్లతో, హెచ్ఎండీఏ రూ. 20 వేల కోట్లతో టెండర్లు పిలిచినట్టు చెప్పారు. ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి భూములు కొనుక్కుని ఆరు లైన్ల రోడ్డు వేసుకోవడానికి రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. వీటన్నింటికీ డబ్బులు ఉన్నప్పుడు మత్స్యకారులు, ఇతర కులవృత్తుల వారికి ఉపాధి కల్పించడానికి మాత్రం డబ్బులు ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. శాసనమండలి వైస్ చైర్మెన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. మహనీయుల విగ్రహాలు నిరంతరం మనకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. హైదరాబాద్ నగర తొలి మేయర్గా కొరికి కృష్ణస్వామి ముదిరాజ్ సమాజా భివృద్ధికి పాటు పడ్డారని తెలిపారు. పండుగ సాయన్న తన ప్రాణాలను లెక్కచేయ కుండా పేదల కోసం పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్లు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, పీఏసీఎస్ చైర్మెన్లు కోల రమేశ్ గౌడ్, ఎల్లంకి మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆనగోని లింగం గౌడ్, బీఆర్ఎస్వీ మండల నాయకులు, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కమీషన్లతో జేబులు నింపుకోవడానికే టెండర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES