నవతెలంగాణ-హైదరాబాద్: ఎమ్మెల్యే దుగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగా క్షమాపణలు చెప్పాలంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ ముగియడంతో అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం ఉదయం మళ్లీ ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించడానికి జూనియర్ ఫ్యాన్స్ ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఎమ్మెల్యే నివాసాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే ముందస్తు సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఈరోజు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసులు మోహరించారు. ఆ క్రమంలో ఆ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లను ఉంచారు. అయినా ఫ్యాన్స్ దూసుకు వచ్చే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులకు , జూనియర్ అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఇంకోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పకపోతే తెలుగుదేశం అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో ఎక్కడికక్కడ వాహనదారులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ యాంత్రాంగం చర్యలు చేపట్టింది.
అసలేం జరిగిందంటే …
జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఒక ఆడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్కు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఆడియో బైటకు వచ్చిన వెంటనే ఆగ్రహించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరోజే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. జూనియర్ కు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ 48 గంటల టైం ఇచ్చారు. ఆ గడువు దాటినా ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పక పోవడంతో మరోమారు ఆయన నివాసం ముట్టడికి ఫ్యాన్స్ ప్రయత్నించారు.