Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయంసరిహద్దుల్లో ఉద్రిక్తత

సరిహద్దుల్లో ఉద్రిక్తత

- Advertisement -

– రక్షణ కార్యదర్శితో ప్రధాని మోడీ భేటీ
– ఉగ్రవాదంపై పోరుకు మద్దతిస్తామన్న పుతిన్‌
– భారత రక్షణ వెబ్‌సైట్లపై దాడి చేశామంటున్న హ్యాకర్లు
– విచారణకు ఆదేశించిన కేంద్రం
– పూంచ్‌లో ఉగ్రవాద స్థావరం ధ్వంసం
– భారత్‌కు దీటుగా జవాబివ్వాలన్న పాక్‌ పార్టీలు
న్యూఢిల్లీ:
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. పాక్‌ సైనికులు వరుసగా 11వ రోజు కూడా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం రాత్రి జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్‌, రాజౌరి, మెంధర్‌, నౌషేరా, సుందర్‌బని, అఖ్నూర్‌ ప్రాంతాలలోని సైనిక పోస్టుల నుండి కాల్పులు జరిగాయి. భారత దళాలు దీటుగా స్పందించి వాటిని తిప్పికొట్టాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం సమావేశమై భారత్‌, పాక్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించింది. ప్రధాని
నరేంద్ర మోడీ త్రివిధ దళాల అధిపతులు, ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన సోమవారం రక్షణ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. మోడీతో ఆదివారం వైమానిక దళ అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ సమావేశమైన విషయం తెలిసిందే. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రధాని మోడీకి ఫోన్‌ చేశారు. పహల్గాం దాడికి కుట్ర పన్నిన దుండగులను చట్టం ముందు నిలపాలని చెప్పారు. ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై భారత్‌ జరుపుతు న్న పోరుకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. ఇదిలావుండగా తాము భారత్‌కు చెందిన అనేక రక్షణ వెబ్‌సైట్లపై దాడి చేశామని, వాటిలోని డేటాను దొంగిలించామని పాక్‌ హ్యాకర్లు చెప్పుకున్నారు. దీనిపై కేంద్రం విచారణకు ఆదేశించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఆటవికమైనదిగా పుతిన్‌ అభివర్ణించారని రష్యా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ దానిపై రాజీ లేని పోరాటం సాగించాల్సిన అవసరం ఉన్నదని పుతిన్‌, మోడీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మన దేశంలో జరిగే భారత్‌-రష్యా సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని కోరగా పుతిన్‌ అందుకు అంగీకరించారు. ఇదిలావుండగా జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా దళాలు కనిపెట్టాయి. అందులో నుంచి ఐదు ఐఈడీలు, రెండు వైర్‌లెస్‌ సెట్లను స్వాధీనం చేసుకున్నా యి. అర కిలో నుండి ఐదు కిలోల వరకూ బరువున్న ఈ ఐఈడీలను ధ్వంసం చేశారు. తద్వారా సరిహద్దు జిల్లాలో పేలుళ్లకు పాల్పడాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను భగం చేశారు. పాకిస్తాన్‌ పౌర, సైనిక నాయకత్వం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను వివరించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని తెహ్రీక్‌-ఐ-ఇన్సాఫ్‌ మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఒకవేళ భారత్‌ దుస్సాహసానికి పాల్పడితే తగిన విధంగా జవాబు చెప్పాలని ఆ పార్టీలు అభిప్రాయపడ్డాయి. కాగా భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగు తున్న దృష్ట్యా పలు అంతర్జాతీయ వైమానిక సంస్థలు పాకిస్తాన్‌ గగనతలాన్ని ఉపయోగించుకోవడం లేదు. వీటిలో ఎయిర్‌ ఫ్రాన్స్‌, బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌, యూఏఈకి చెందిన ఎమిరేట్స్‌, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఉన్నాయి.
మరో సర్జికల్‌ స్ట్రైక్‌!
బాగ్లీహార్‌ డ్యాం నుంచి నీటి విడుదల నిలిపివేత
న్యూఢిల్లీ :
పాకిస్తాన్‌పై భారత్‌ మరో సర్జికల్‌ స్ట్రైక్‌ జరిపింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా బాగ్లీహార్‌ డ్యాం నుండి నీటి విడుదలను నిలిపివేసింది. చెనాబ్‌ నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట ద్వారా పాకిస్తాన్‌కు నీరు చేరుతోంది. అలాగే జీలం నదిపై నిర్మించిన కిషన్‌గంగ డ్యాం నుండి పాక్‌కు చేరుతున్న నీటిని కూడా నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. జమ్మూలోని రాంబన్‌లో బాగ్లీహార్‌ జలవిద్యుత్‌ డ్యాం ఉండగా ఉత్తర కాశ్మీర్‌లో కిషన్‌గంగ జలవిద్యుత్‌ డ్యాం ఉంది. ఈ రెండు ఆనకట్టల నుండి నీటి విడుదలను కేంద్రం నియంత్రించవచ్చు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య బాగ్లీహార్‌ డ్యాంపై దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదంలో ప్రపంచబ్యాంక్‌ జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్‌ డిమాండ్‌ చేస్తోంది. జీలంకు ఉపనది అయిన నీలంపై కిషన్‌గంగ డ్యాం ప్రభావం చూపుతుందంటూ పాక్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
సివిల్‌ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించండి..
– రాష్ట్రాలకు కేంద్రం సూచన
– శత్రు దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణపై అవగాహనకు చర్యలంటూ ప్రకటన
న్యూఢిల్లీ:
పహల్గాం ఉగ్రదాడితో భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ భద్రతా సన్నద్ధతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు బుధవారం (మే 7న) మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని కొన్ని రాష్ట్రాలకు కేంద్ర హౌంశాఖ సూచించింది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో తెలపాలని పేర్కొంది. శత్రు దాడి జరిగినప్పుడు విద్యార్థులు, పౌరులు తమను తాము రక్షించుకొనేందుకు వీలుగా స్వీయ రక్షణపై అవగాహన కల్పించాలి తెలిపింది.
పాకిస్తాన్‌పై భారత్‌ ప్రతీకార దాడులు చేయొచ్చనే అంచనాలు నెలకొన్న తరుణంలో కేంద్ర హౌంశాఖ ఈ తరహా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. పాక్‌ సైతం ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్టు కనబడుతోంది. శత్రు దేశం దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై సన్నద్ధతా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. ఎయిర్‌ రైడ్‌ హెచ్చరిక సైరెన్ల పనితీరును పరీక్షించాలని ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో పౌరులకు తెలపాలని నిర్దేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -