నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి వారం కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ) అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ముంబై జట్టు క్యాంప్లో చేరకుండా నేరుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు వెళ్లినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. దీంతో అతని ఫిట్నెస్పై చర్చ మొదలైంది.
బుమ్రా గాయం కారణంగా అక్కడికి వెళ్లాడా? లేక సాధారణ ఫిట్నెస్ పరీక్షల కోసమా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ముంబై తమ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉండగా, బుమ్రా జట్టుతో కలవకపోవడం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. అయితే, ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యులకు ఐపీఎల్ క్యాంపులో చేరడానికి ముందు అదనపు విశ్రాంతిని ఇచ్చినట్లు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే గతంలోనే ప్రకటించారు. బహుశా ఆ కారణంగానే బుమ్రా ఆలస్యంగా జట్టుతో చేరతాడని మేనేజ్మెంట్ వర్గాలు భావిస్తున్నాయి.



