Friday, June 20, 2025
E-PAPER
Homeఆటలుది అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీ

ది అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీ

- Advertisement -

– భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు
– ట్రోఫీ ఆవిష్కరించిన సచిన్‌ టెండూల్కర్‌, జేమ్స్‌ అండర్సన్‌

లండన్‌ (ఇంగ్లాండ్‌) : భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌ సమరంలో సరికొత్త అధ్యాయం ఆరంభం కాబోతుంది. ఇప్పటివరకు పటౌడీ ట్రోఫీ (ఇంగ్లాండ్‌లో), ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ (భారత్‌లో)గా కొనసాగుతున్న భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు అండర్సన్‌-టెండూల్కర్‌ పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. గురువారం లండన్‌లోని లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ది అండర్సన్‌-టెండూల్కర్‌’ ట్రోఫీని క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, జేమ్స్‌ అండర్సన్‌ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఇంగ్లాండ్‌ తరఫున జేమ్స్‌ అండర్సన్‌, భారత్‌ తరఫున సచిన్‌ టెండూల్కర్‌ టెస్టు క్రికెట్‌లో తిరుగులేని దిగ్గజాలు. జేమ్స్‌ అండర్సన్‌ 180 టెస్టుల్లో రికార్డు 704 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేస్‌ బౌలర్‌గా అండర్సన్‌ నిలిచాడు. ఓవరాల్‌గా స్పిన్‌ దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్‌, షేన్‌ వార్న్‌ మాత్రమే వికెట్ల వేటలో అండర్సన్‌ కంటే ముందున్నారు. సచిన్‌ టెండూల్కర్‌ 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక టెస్టులు, అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా టెండూల్కర్‌ కొనసాగుతున్నాడు. 16 ఏండ్ల ప్రాయంలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సచిన్‌ 24 ఏండ్ల పాటు జాతీయ జట్టు తరఫున పరుగుల వరద పారించాడు. భారత్‌తో 39 టెస్టుల్లో ఆడిన జేమ్స్‌ అండర్సన్‌ 25.47 సగటుతో 149 వికెట్లు పడగొట్టాడు. ఆరు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. 2018 లార్డ్స్‌ టెస్టులో 5/20 ఉత్తమ ప్రదర్శన. ఇంగ్లాండ్‌తో సచిన్‌ టెండూల్కర్‌ 32 టెస్టుల్లో 51.73 సగటుతో 2535 పరుగులు చేశాడు. 2002 లీడ్స్‌ టెస్టులో 193 పరుగుల ఇన్నింగ్స్‌ సచిన్‌కు ఇంగ్లాండ్‌పై ఉత్తమ ప్రదర్శన.
ఇదిలా ఉండగా, భారత మాజీ క్రికెటర్లు సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌ సహా బీసీసీఐ సూచనలతో భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో దిగ్గజం మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ వారసత్వం కొనసాగేలా.. చాంపియన్‌గా నిలిచిన జట్టు కెప్టెన్‌కు ‘పటౌడీ’ మెడల్‌ను ప్రదానం చేయనున్నారు. భారత్‌, ఇంగ్లాండ్‌ ఇప్పటివరకు 136 టెస్టుల్లో ఢకొీట్టగా.. ఇంగ్లాండ్‌ 51, భారత్‌ 35 టెస్టుల్లో విజయాలు సాధించాయి. 50 టెస్టులు డ్రాగా ముగిశాయి. ది అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీలో తొలి టెస్టు నేడు లీడ్స్‌లో షురూ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -