– మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి
– నేషనల్ పార్క్ అడవుల్లో ఎదురుకాల్పులు
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు క్యాడర్ కేంద్ర కమిటీ సభ్యులు (సీసీఎం) గౌతమ్ అలియాస్ సుధాకర్ మృతి చెందినట్టు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం ఎస్టీఎఫ్, డీఆర్జీ కోబ్రాకు చెందిన భద్రతా బలగాలు భారీగా కూంబింగ్ చేపట్టాయని చెప్పారు. ఆపరేషన్లో ఏకే-47 రైఫిల్తో పాటు పెద్ద మొత్తంలో ఇతర పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా సీపీఐ(మావోయిస్టు)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కేశవరావు మృతి మరిచిపోకముందే ఇప్పుడు సుధాకర్ మృతి చెందడం.. మావోయిస్టులకు పెద్ద దెబ్బని పలువురు విశ్లేషిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు బస్తర్ పరిధిలో 403 మంది మావోయిస్టు కేడర్ల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు సాయుధ మావోయిస్టు కేడర్లు ఈ ప్రాంతంలో ఉన్నారంటూ సెర్చ్ అపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన రామకృష్ణ నాయుడు కుమారుడు గౌతమ్(67) అలియాస్ సుధాకర్ అలియాస్ ఆనంద్ అలియాస్ చంటి బాలకృష్ణ అలియాస్ రామరాజు, అలియాస్ అరవింద్ అలియాస్ సోమన్న. మావోయిస్టు పార్టీలో వివిధ హౌదాలో సుమారు 40 ఏండ్ల పాటు పనిచేశారు. కేంద్ర కమిటీ సభ్యులు, విప్లవాత్మక రాజకీయ పాఠశాలకు ఇన్చార్జిగా, సెంట్రల్ రీజినల్ బ్యూరోలో పని చేశారు. భద్రతా దళాల సిబ్బంది బలిదానానికి దారితీసిన అనేక హింసాత్మక సంఘటనలకు సుధాకర్ కారణమయ్యారని పోలీసులు తెలిపారు. అందుకే ఇతనిపై రూ.కోటి రివార్డు ఉన్నట్టు తెలిపారు. 2004లో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు.
మళ్లీ పేలిన తూటా
- Advertisement -
- Advertisement -