నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో ఆ జట్టు సెమీ ఫైనల్ అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. తమ భవిష్యత్తు ఇప్పుడు దేవుడి చేతిలో ఉందని, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి రావడం దురదృష్టకరమని ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా శిబిరంలో తీవ్ర నిరాశ అలముకుంది. మ్యాచ్ అనంతరం మార్ష్ మాట్లాడుతూ “ఆట తొలి అర్ధభాగంలో మేం మెరుగైన స్థితిలోనే ఉన్నాం. 182 పరుగులు మంచి స్కోరే అయినప్పటికీ, మా ఆరంభానికి అది సరిపోదు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. ముఖ్యంగా చివరి ఓవర్లలో శ్రీలంక బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మమ్మల్ని కట్టడి చేశారు” అని ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.
మరోవైపు, ఈ అద్భుత విజయంపై శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక హర్షం వ్యక్తం చేశాడు. ఇది తమ జట్టు ఇటీవలి కాలంలో ఇచ్చిన అత్యుత్తమ ప్రదర్శన అని కొనియాడాడు. “హసరంగ, పతిరన వంటి ప్రధాన బౌలర్లు లేకపోయినా, వారి లోటును ఇతర బౌలర్లు తీర్చారు. చాలా ఏళ్ల తర్వాత తదుపరి రౌండ్కు వెళ్తున్నందుకు గర్వంగా ఉంది. ఇదే ఉత్సాహంతో సెమీస్ కూడా చేరతామన్న నమ్మకం ఉంది” అని శనక ధీమా వ్యక్తం చేశాడు.



