నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫెర్రీ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న బస్సు నదిలో పడిపోవడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం రాజ్బారి జిల్లాలోని దౌలాడియా టెర్మినల్ వద్ద బుధవారం సాయంత్రం సుమారు 5.15 గంటల ప్రాంతంలో జరిగింది. బస్సు పద్మానదిలో పడిపోయినట్లు వెల్లడించారు. దీనికి సంభవించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. రక్షణ చర్యల్లో భాగంగా రెస్క్యూ బృందాలు క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీశాయి. బస్సులోపల 14 మృతదేహాలు లభించగా, డైవర్లు మరో ఇద్దరు మహిళల మృతదేహాలను గుర్తించారు. దాదాపు ఆరు గంటల శ్రమ అనంతరం బస్సును బయటకు తీశారు.
ప్రమాద సమయంలో 11 మంది ప్రయాణికులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. సైన్యం, పోలీసులతో కలిసి అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్గార్డ్ డైవర్లు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ బస్సు ఢాకాకు వెళ్తుండగా, అందులో పిల్లలతో సహా సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో చాలామంది ఈద్ సెలవుల అనంతరం తిరిగి వస్తున్న వారేనని అధికారులు తెలిపారు.
ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ ఘటనపై ఆరా తీసి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
ఫెర్రీ ఎక్కుతుండగా మరో చిన్న యుటిలిటీ ఫెర్రీని ఢీకొట్టడంతో బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయిందని టెర్మినల్ సూపర్వైజర్ తెలిపారు. ప్రయాణికులలో పలువురు ఒకే కుటుంబానికి చెందినవారని సమాచారం.



