నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో రెండు ప్రధాన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. జార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాలను కవర్ చేసే రైల్వే లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి మొత్తం వ్యయం రూ.6,405 కోట్లు అని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు.
కేంద్రం ఆమోదించిన వాటిలో బళ్లారి-చిక్ బజూర్ (Ballari–Chikjajur) రైల్వే లైన్ డబ్లింక్ ఒకటి. రూ. 3,342 కోట్లతో 185 కిలోమీటర్ల మేర ఈ లైన్ ను డబ్లింగ్ చేయబోతున్నది. ఈ నిర్ణయంతో మంగళూరు పోర్టును సికింద్రబాద్ తో అనుసంధానానికి మార్గం సుగమం కానుంది. కర్ణాటకలోని బళ్లారి, చత్రదుర్గ, ఏపీలోని అనంతపురం మీదుగా డబ్లింగ్ లైన్ ఉండనుంది. ఈ డబ్లింగ్ లైన్ తో వాణిజ్య రవాణా మరింతగా పెరగనుంది. కేబినెట్ ఆమోదించిన మరో లైన్ కోడెర్మా-బర్కకానా (Koderma–Barkakana) ట్రాక్ డబ్లింగ్. ఇది 133 కి.మీ పొడవుతో జార్ఖండ్లోని ప్రధాన బొగ్గు ఉత్పత్తి ప్రాంతం గుండా వెళ్లడమే కాకుండా పాట్నా, రాంచీ మధ్య అతి తక్కువ మరింత సమర్థవంతమైన రైలు లింక్గా నిలవబోతుందని మంత్రి వెల్లడించారు.