అబద్ధాలు మూడు రకాలంటారు పండితులు! ఒకటి అలవోకగా చెప్పేవి! రెండు ఆచి తూచి చెప్పేవి! మూడు అంకెలతో చెప్పేవి! ఇంగ్లీషులో ”ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్” అంటారు గాని దీన్ని మనం వర్తమానానికి వర్తింపజేసి చెప్పాలంటే ”అబద్ధాలు అంకెలు” అనాలి. ”సత్యమేవ జయతే” అని సాక్షాత్తు జాతీయ చిహ్నం మీదనే రాసుకున్న దేశంలో పాపం అంకెలకు ఈ గతి పట్టింది. చాలా విచిత్రమైన విషయం ఏమంటే మన చట్టసభల్లో ”అబద్ధం” అనడం దాదాపు నిషేధం. పొరపాటున ఏ సభ్యుడైనా అంటే అర్జెంటుగా సభాపతి దాన్ని”సత్య దూరం” అని సరిదిద్దుకో మంటారు. బహుశా భవిష్యత్ నాయకుల్ని, ప్రభుత్వాలను, చట్ట సభల్ని దృష్టిలో వుంచుకొనే కాబోలు నన్నయ శకుంతల చేత ”నూరు కొడుకుల కన్నా ఒక సత్య వాక్యం గొప్పద”ని నిండు సభలో దుష్యంతుడికి సుద్దులు చెప్పిస్తాడు.
ఇలా ఎంత చెప్పుకున్నా ఏం లాభం! ఆధునిక అబద్ధం మాత్రం అంకెల్ని ఆయుధాలుగా మార్చుకొని, సామాజిక మాధ్యమాల స్వారీ గుర్రాలెక్కి వీరవిహారం చేస్తూనే వుంది. పండితుల చేతిలో పడ్డ గణాంకాలు కోరిన రూపంలోకి మారి సత్యాలను సమాధి చేస్తూనే వున్నాయి.ఇదంతా ఒక ఎత్తు. ప్రభుత్వాలది ఒక ఎత్తు. అంకెల గారడీ కోసమే దాని యంత్రాంగమంతా అహోరాత్రులు శ్రమిస్తూ వుంటుంది. ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తూనే వుంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అవే గణాంకాలు రూపాంతరం చెందుతాయి. ఎదురు దాడికి శస్త్రాస్త్రాలుగా మారతాయి.సున్న, స్థాన విలువ లాంటి అసాధారణ గణితావిష్కరణలు చేసిన భారతదేశంలో ఆమాత్రం గణాంక మాయాజాల కళా వైదుష్యం వుండదా అని సరిపెట్టుకుంటే (గర్వపడితేనో!) అది వేరే సంగతి. దీనివల్ల సత్యం ఎంత సమాధి అవుతోందనుకుంటే మాత్రం గుండె గుభిల్లుమంటుంది.
ఈ అబద్ధాలకు, అంకెలకు మన దేశంలో వున్న గాఢాతిగాఢ స్నేహబంధాన్ని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక కరోనా మరణాల లెక్కలతో మన కండ్ల ముందుంచింది. దీని ప్రకారం గుజరాత్ ప్రభుత్వం 2021లో కేవలం 5812 కరోనా మరణాలు జరిగాయని పేర్కొంటే నిజంగా జరిగినవి దీనికి 44 రెట్లు ఎక్కువ! అంటే రెండు లక్షలు. ఇలా చూస్తే అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా అబద్ధాల్లో మాత్రం గుజరాత్ను మించిన రాష్ట్రం దేశంలోనే లేదు.ఉత్తరప్రదేశ్ కేవలం 14,551 మరణాల్ని లెక్కల్లో చూపిస్తే నిజానికి దీనికి 19.5 రెట్ల మరణాలు జరిగాయి. అంటే 2.6 మరణాల్ని ఈ రాష్ట్రం మాయం చేసేసింది! మధ్యప్రదేశ్లో కూడా లెక్కల్లోకి వచ్చిన మరణాలకు వాస్తవ మరణాలకు తేడా దాదాపు 20 రెట్లు వుంది. ఇక తెలంగాణలో 18 రెట్లు..బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో ప్రకటించిన మరణాల కంటే 13 రెట్లు ఎక్కువ మరణాలు ఉన్నాయి. తమిళనాడు కూడా తక్కువేం తినలేదు. రెండు లక్షల మరణాలు తక్కువ చేసి చూపించింది. కేరళ, కర్నాటకల్లో మాత్రం ఈ తప్పుడు లెక్కలు బాగా తక్కువగా ఉండడం విశేషం. అన్నీ కలిపి చూస్తే మన కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించిన కరోనా మరణాలు 3.30 లక్షలు. కానీ వాస్తవంగా జరిగినవి 21.5 లక్షలు. అంటే 6.5 రెట్లు ఎక్కువ!
ఇంత నిగ్గు తేల్చడానికి ఆ ఆంగ్ల పత్రిక మొదట కరోనా పూర్వపు 2015-2019 కాలంలో జరిగిన మరణాల వివరాలు సేకరించింది. వీటి ఆధారంగా 2020-2021 సంవత్సరాల్లో ఎన్ని సాధారణ మర ణాలు జరిగే అవకాశం వుందో లెక్కించింది. రిజిస్టర్ జనరల్, జనాభా కమిషనర్ కార్యాలయాలు ఈ రెండు సంవత్సరాల్లో ప్రకటించిన మరణాలకు వీటికి మధ్య ఎంత తేడా వుందో లెక్క తీసి కరోనా మరణాల అసలు సంఖ్యను కూపీ లాగింది. ఇక దీనికి ఆయా ప్రభుత్వాలు ప్రకటించిన మరణాలకీ తేడా ఎంతో రాష్ట్రాల వారీ లెక్కగట్టి వాస్తవాలను బయటపెట్టింది. ఇప్పుడు ఊహించండి అంకెలు ఎంతెంత అబద్ధాలు చెప్పగలవో, ఇలాంటి అబద్ధాల్ని ప్రభు త్వాలే ఎలా వండి వారుస్తున్నాయో, ”సత్యమేవ జయతే” నినాదం సత్యంగా మారాలంటే ఎంత కాలమూ, ఎంత శ్రమా, ఎంత నిష్టా అవసరం అవుతాయో!
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్
కేంద్రం ‘దాచిన’ మరణాలు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES