నవతెలంగాణ-హైదరాబాద్: ఓవైపు పెరిగిన నిత్యావసర ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తుండగా..మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు రవాణా ఛార్జీలు పెంచి వేతన జీవుల ఆదాయానికి గండికొడుతున్నాయి. ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీ సాధారణ చార్టీలతో పాటు విద్యార్థుల బస్ పాస్ రేట్లను అమాంతం పెంచేసింది. అది చాలదన్నట్లుగా మెట్రో చార్జీలను కూడా 10శాతం పెంచి మెట్రో ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. అదే విధంగా గ్యాస్, పెట్రో ధరలు పెరిగి శ్రమజీవుల అరకోరగా జీతాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇదే తరుణంలో పేదవాడి చౌక రవాణంగా భావించే రైల్వే టికెట్ల ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచేసింది.
మోడీ ప్రభుత్వ నిర్ణయంతో రైల్వే ప్రయాణికులపై భారం పడనుంది. టిక్కెట్ ధరలు పెరగనున్నట్లు సంబంధిత రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. పెరిగిన ధరలు సుదూరం ప్రయాణించే నాన్ ఏసి, ఏసి ప్రయాణికులపై స్వల్ప ప్రభావం చూపనున్నాయని పేర్కొన్నాయి. పెరిగిన ధరలు జులై 1 నుండి అమల్లోకి రానున్నాయని విశ్వాసనీయ సమాచారం. కొవిడ్ మహమ్మారి తర్వాత మొదటిసారి రేట్లను పెంపు ఉండనుందని పేర్కొన్నాయి.
మెయిల్, ఎక్స్ప్రెన్, నాన్ ఏసి రైళ్లకు కిలోమీటరుకు 1 పైసా, ఏసి తరగతులకు కిలో మీటరుకు 2 పైసలు పెరగనున్నాయి. అయితే 500 కి.మీ వరకు ప్రయాణాలకు సబర్బన్ టిక్కెట్లు, సెకండ్ క్లాస్ ప్రయాణాలకు చార్జీల పెంపు వర్తించదు. 500 కి.మీ దాటితే సెకండ్ క్లాస్కు కిలో మీటరుకు అరపైసా పెంపు ఉండనుంది. రోజువారీ, నెలవారీ సీజన్ టిక్కెట్ల ధరల్లో కూడా మార్పు ఉండదని ఆ వర్గాలు తెలిపాయి.
తత్కాల్ బుకింగ్లో కూడా నిబంధనలను మారనున్నట్లు ఆ వర్గాలు ప్రకటించాయి. 2025 జులై1 నుండి ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేసిన ప్రయాణికులు మాత్రమే ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉండనుంది.