జయంతి కార్యక్రమంలో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్
రాజ్యాధికారం గురించి సామాన్యుడు ఆలోచించడానికి సాహసించని కాలంలో.. ఏకంగా గోల్కొండ రాజ్యాన్ని ఏలిన సామాన్యుడు.. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని పలువురు వక్తలు కొనియాడారు. పాపన్న 375వ జయంతిని సోమవారం కల్లుగీత కార్మిక సంఘం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సంయుక్తంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కే హాల్లో టీపీఎస్కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు మాట్లాడుతూ.. పన్నులకు వ్యతిరేకంగా 12 మందితో తన పోరాటాన్ని ప్రారంభించి 12 వేల మంది సైనిక శక్తిని పెంచిన పరిపాలనాదక్షులు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి.రమణ మాట్లాడుతూ.. పాపన్న చరిత్రను ప్రజలకు తెలియజేసేందుకు.. వారి పుట్టుక నుంచి వీరుడుగా నేలకొరిగే వరకు చరిత్రను దృశ్యీకరించినట్టు చెప్పారు. పల్లెల్లో పాపన్న జైత్రయాత్ర సభలు, సమావేశాలు నిర్వహించి.. ఆయన వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించామని, వాటిని ప్రభుత్వం గుర్తించి నేడు పాపన్న విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిందని చెప్పారు. భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తాబేదారులు, జమీన్దారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాముల దురాగతాలను పాపన్న గమనించి గోల్కొండ కోటపై బడుగుల జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించారన్నారు. మొగల్ చక్రవర్తిని గడగడలాడించిన బహుజన వీరుడు పాపన్న అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బెల్లం కొండ వెంకటేశ్వర్లు, గౌడ/వృత్తి సంఘాల అధ్యక్షులు అంబాల నారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సామాన్యుడి ధిక్కారస్వరం సర్దార్ సర్వాయి పాపన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES