– నాకు వ్యతిరేకంగా పని చేశారు
– వాళ్ల గురించి మాట్లాడితే నా మీద పడి ఏడుస్తారెందుకు?
– కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమించా
– నేను మంచిదాన్ని కాదు..నా జోలికి ఎవరూ రావద్దు
– బీఆర్ఎస్ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించే యత్నం : పాత్రికేయులతో ఇష్టాగోష్టిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిజామాబాద్ ఎంపీ స్థానానికి 2019లో ఎన్నికలు జరిగినప్పుడు… పార్టీలోని కోవర్టులే తనను ఓడించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వారు తనకు వ్యతిరేకంగా పని చేశారంటూ ఆమె వాపోయారు. పార్టీకి సంబంధించి పలు విషయాలను పేర్కొంటూ కొద్ది రోజుల క్రితం ఆమె తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్కు లేఖ రాసిన సంగతి విదితమే. అది బయటకు రావటంతో కవిత పార్టీ మారబోతున్నారు.. కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన అన్న కేటీఆర్తోపాటు ఇతర నేతలపై ఆమె పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన సందర్భంలో ఆ జిల్లాలో తనకు ప్రొటోకాల్ ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ తనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని తెలిపారు. ఈ వాస్తవాలు తెలియని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కోసం కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పని చేసిన చరిత్ర తనకుందని వివరించారు.
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులిస్తే బీఆర్ఎస్ నేతలు ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారంటూ కవిత ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేవలం ట్విట్టర్లో పోస్టులు పెడితే పార్టీ నడుస్తుందా? అంటూ కేటీఆర్నుద్దేశించి ఆమె పరోక్షంగా ఎద్దేవా చేశారు. పార్టీ నాయకుల కాలేజీలపైకి కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లను పంపితే ఎవరైనా అడ్డుకున్నారా? అంటూ నిలదీశారు. ‘బీఆర్ఎస్లో మీరు పెంచి పోషించిన ఎంపీలు ఏ పార్టీలోకి వెళ్లారు…?’ అని ప్రశ్నించారు. వరంగల్లో నిర్వహించిన రజతోత్సవ సభ కేసీఆర్ వల్లే జయప్రదమైందని తెలిపారు. ప్రస్తుతమున్న వాళ్లు ఆయనకంటే పెద్ద నాయకులు కాదంటూ ఎద్దేవా చేశారు. ‘నా తండ్రికి నేను లేఖ రాస్తే తప్పేముంది? ఆయనకు ఇప్పటి వరకూ వంద లేఖలు రాశాను. నేను మా నాన్నకు లెటర్ రాసిన ప్రతీసారి ఆయన దాన్ని చదివి, వెంటనే చింపేస్తారు. ఈసారి మాత్రం అది ఎలా లీకయిందో తెలియదు. దాన్ని ఎవరు లీక్ చేశారో తెలియాలి…’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెప్పుడూ పార్టీ లైన్ దాటి పని చేయలేదని స్పష్టం చేశారు. ‘నేను అసలు మంచిదాన్ని కాదు.. నా జోలికి ఎవరూ రావొద్దు…’ అంటూ హెచ్చరించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని మరచిపోయే విధంగా నేతలు పనిచేస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు.
పార్టీలో కోవర్టులున్నారని చెబితే… వారిని కంట్రోల్ చేయకుండా తన మీద పడి ఏడుస్తారెందుకంటూ కవిత ప్రశ్నించారు. కోవర్టులను కంట్రోల్ చేయకపోవటం ఎవరి తప్పని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్రెడ్డి ప్రభుత్వం మారిస్తే.. బీఆర్ఎస్ తరపున ఎందుకు ఆందోళనలు చేయలేదన్నారు. దానికి భిన్నంగా రేవంత్, అదానీ… ఇద్దరు దోస్తులంటూ టీషర్టులు వేసుకుని ధర్నాలు చేశారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంతోపాటు ఇతర సాగునీటి పారుదల ప్రాజెక్టులపై తెలంగాణ జాగృతి, వికాస సమితి మాత్రమే మాట్లాడున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి అంశాలపై బీఆర్ఎస్ తరపున నేతలు ఎందుకు పోట్లాడటం లేదని ప్రశ్నించారు.
పార్టీ నుంచి తనను ఎవరూ బయటకు పంపలేరంటూ కవిత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ నేతలతో మాట్లాడాననేది శుద్ధ అబద్ధమని కొట్టిపారేశారు. తెలంగాణ కోసం 2013లో ఒక్కసారి మాత్రమే ఆ పార్టీ అధిష్టానంతో మాట్లాడానని తెలిపారు. అయినా కాంగ్రెస్ అనేది మునిగిపోయే నావంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సీరియస్గా ఉండి, కరెక్టుగా పని చేస్తే బీజేపీ గెలిచేదే కాదని అన్నారు. ‘ఎవరు అవునన్నా కాదన్నా నా పార్టీ బీఆర్ఎస్.. నా నాయకుడు కేసీఆర్…’ అని స్పష్టం చేశారు. పార్టీలో కేసీఆర్ మాత్రమే నాయకుడంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కు ఇచ్చే మర్యాద, ప్రొటోకాల్ ఆయనకు ఇస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి దగ్గరున్న నాయకుల్లో చాలా మంది బీఆర్ఎస్ నుంచి (కేటీఆర్ గ్రూపు) వెళ్లిన వారు కాదా? అని ప్రశ్నించారు. దామోదరరావు, గండ్ర మోహనరావు ఎవరికి దగ్గరో మీకు తెలుసా? అంటూ నిలదీశారు. తనను పార్టీ నుంచి దూరం చేస్తే ఎవరికి లబ్ది జరుగుతుందో వారికే (కేటీఆర్ గ్రూపు) తెలుసునని అన్నారు. అందుకే కేసీఆర్ను, తనను విడదీసేందుకు కుట్రలు పన్నుతున్నారని వాపోయారు.
రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేయకుండా బీఆర్ఎస్ను గంపగుత్తగా ఆ పార్టీకి అప్పగించేందుకు ప్రయత్నం జరుగుతోందని కవిత ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్, బీజేపీ నాయకులతో సఖ్యతగా ఉంటున్నారని ఆరోపించారు. అయితే తాను మాత్రం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా అడ్డుకున్నానని తెలిపారు. లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో తాను ఆరు నెలలు కాదు.. ఏడాది జైల్లో ఉంటానని కేసీఆర్కు చెప్పానని వివరించారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డానని చెప్పారు. ‘నన్ను ఏమీ చేయలేక…నీపై కేసులు బనాయిస్తున్నారు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు…’ అంటూ కేసీఆర్ తనతో చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆయన లాగా మొండిదాన్ననీ, లక్ష్యాన్ని సాధించే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. తన లక్ష్యమైన సామాజిక తెలంగాణ కోసం కషి చేస్తానని తెలిపారు.
సింగరేణి సంస్థను అమ్మేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు పన్నుతోందని కవిత ఆరోపించారు. మరోవైపు కొద్ది నెలల క్రితం హైదరాబాద్లోని ప్రజా భవన్లో సీఎం రేవంత్రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారనీ, ఆ తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని చెప్పారు. ఇలాంటి వాస్తవాలను పక్కనబెట్టి తెలంగాణ ప్రాజెక్టులకు తానెప్పుడూ వ్యతిరేకంగా పని చేయ లేదంటూ చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ.. ఎన్డీయేలో భాగస్వామిగా మారిన తర్వాత తెలంగాణపై కుట్రలు మరింతగా పెరిగా యని ఆవేదన వ్యక్తం చేశారు. 200 టీఎమ్సీల నీళ్లను ఏపీకి అదనంగా తరలించేందుకే బనకచర్లను తెరపైకి తెచ్చారంటూ వాపోయారు. ఆ ప్రాజెక్టును వ్యతిరేకించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తనకు నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు ముందుగా బనకచర్లపై కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలన్నింటినీ వదిలిపెట్టి, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయటం తగదని కేటీఆర్ బృందానికి కవిత హితవు పలికారు.
కోవర్టులే నన్ను ఓడించారు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES