Saturday, June 28, 2025
E-PAPER
Homeజాతీయంభారత్‌తో ఒప్పందం చాలా పెద్దది కావచ్చు

భారత్‌తో ఒప్పందం చాలా పెద్దది కావచ్చు

- Advertisement -

– చైనా డీల్‌పై సంతకం తర్వాత ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
– ఈ రెండు దేశాలతో అగ్రిమెంట్లపై స్పష్టతనివ్వని అమెరికా అధ్యక్షుడు
న్యూఢిల్లీ:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో తదుపరి చాలా పెద్ద ఒప్పందం ఉండొచ్చని హింట్‌ ఇచ్చారు. దీంతో ట్రంప్‌ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఆ పెద్ద ఒప్పందం ఏదై ఉండొచ్చన్న ఆసక్తి ఇరు దేశాల్లోని మార్కెట్లలో నెలకొన్నది. చైనాతో వాణిజ్య ఒప్పందంపై యూఎస్‌ సంతకం చేసినట్టు డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరమే భారత్‌తో అతిపెద్ద ఒప్పందమంటూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ”మేము ఇప్పుడే చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాం. మేము అందరితోనూ ఒప్పందాలు చేసుకోం. కానీ మాకు కొన్ని గొప్ప ఒప్పందాలున్నాయి. బహుశా భారత్‌తో కాబోయే ఒప్పందం చాలా పెద్దది” అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యయ బిల్లును ప్రోత్సహించటంపై దృష్టి సారించిన వైట్‌ హౌజ్‌ కార్యక్రమంలో ట్రంప్‌ ఈ విధంగా చెప్పారు. చైనాతో నూతన ఒప్పందం అనేది గతంలో పరిమితం చేయబడిన వాణిజ్య మార్గాలను తెరుస్తుందని అన్నారు. ”మేము భారత్‌కు దారి తెరవబోతున్నాం. ప్రతీ దేశంతో సంబంధం చాలా బాగుంది” అని ట్రంప్‌ తెలిపారు. ఇవన్నీ చెప్పిన ట్రంప్‌.. అసలు చైనా ఒప్పందం గురించి మాత్రం ఎలాంటి నిర్దిష్ట వివరాలనూ తెలియజేయక పోవటం గమనార్హం. వాణిజ్య ఒప్పందాలను కొనసాగించటంలో తమ ప్రభుత్వం సెలెక్టివ్‌గా (తమకు అను కూలంగా) ఉంటుందని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ నెల ప్రారంభంలో యూఎస్‌- ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరమ్‌లో యూఎస్‌ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్‌ లుట్నిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కావచ్చని అన్నారు. రెండు దేశాలు తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇద్దరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.
ఆ ఒప్పందాలేంటి?
ఇటీవలి కాలంలో యుద్ధాలైనా, వాణిజ్య ఒప్పందాలైనా.. వాటిపై ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు, చర్యలు తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉన్నానన్న విషయం కూడా మరిచిపోయి మరీ ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితికి కారణమయ్యారు. పరస్పర సుంకాల విధింపునకు తెరదీశారు. భారత్‌తో పాటు పలు దేశాలపై ఎడాపెడా వాణిజ్య సుంకాలను పెంచేశారు. ట్రంప్‌ టారిఫ్‌ వార్‌కు భయపడిన భారత్‌ సహా పలు దేశాలు దిగివచ్చాయి. ఇక చైనానే టార్గెట్‌గా ఆ దేశంపై టారిఫ్‌లను ఆయన అమాంతం పెంచేశారు. ఈ విషయంలో అమెరికా చర్యలకు చైనా బెదరలేదు. అమెరికాపై అదే స్థాయిలో సుంకాలను విధించింది. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఆసియా నుంచి తనకు పోటీగా వస్తున్న చైనాను ఎదుర్కోవటానికి అన్ని చర్యలూ తీసుకున్నారు. ఇప్పుడు ఒప్పందాలంటూ మళ్లీ ఆయనే మాట్లాడుతున్నారు. అయితే, భారత్‌తో జరగబోయే ఒప్పందం ఏమిటి? చైనాతో సంతకం చేసిన డీల్‌ ఏమిటి? అనేది మాత్రం ఆయన బయట పెట్టకపోవటాన్ని విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -