– సంక్షోభాల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచిన ఘనత రాజ్యాంగానిదే
– దేశంలోని చివరి పౌరుడికీ న్యాయం అందడమే ప్రాథమిక విధి : సీజేఐ జస్టిస్ గవారు
న్యూఢిల్లీ: రాజ్యాంగం వల్లే దేశంలో అభివృద్ధి జరిగిందనీ, సంక్షోభాల సమయంలో దేశాన్ని ఐక్యంగా ఉంచిన ఘనత రాజ్యాంగానిదేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవారు అభిప్రాయపడ్డారు. దేశం సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా భారత రాజ్యాంగం దృఢంగా ఉందనీ, దేశాన్ని ఐక్యంగా ఉండేలా రాజ్యాంగం చూస్తుందని అన్నారు. అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్ ఛాంబర్లు, బహుళ స్థాయి పార్కింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవారు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ పాల్గొన్నారు. ”రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు, దాని తుది ముసాయిదాను సభముందు సమర్పించినప్పుడు రాజ్యాంగం సమాఖ్య అని కొందరు అన్నారు. ఇంకొందరు ఏకీకృతమని చెప్పేవారు.
కానీ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ మాత్రం రాజ్యాంగం పూర్తిగా సమాఖ్య లేదా ఏకీకృతం కాదని సమాధానం ఇచ్చారు. కానీ నేను మీకు ఒక విషయం చెప్పగలను. రాజ్యాంగం యుద్ధ సమయాల్లో భారతదేశాన్ని ఐక్యంగా, బలంగా ఉంచింది. మన దేశంపై దాడి జరిగినప్పుడల్లా రాజ్యాంగం విజయం సాధించింది” అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవారు వివరించారు.
‘రాజ్యాంగం వల్లే దేశంలో అభివృద్ధి’
రాజ్యాంగం కారణంగా స్వాతంత్య్రం తర్వాత భారత్ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని సీజేఐ జస్టిస్ బీఆర్ గవారు తెలిపారు. భారత్ పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో నేడు మనం చూస్తున్నామన్నారు. స్వాతంత్య్రం తర్వాత భారత్ అభివ ృద్ధి వైపు ప్రయాణిస్తోందని చెప్పారు. దేశంలోని చివరి పౌరుడికి న్యాయం అందడం ప్రాథమిక విధిగా అభివర్ణించారు. శాసనసభ అయినా, కార్యనిర్వాహక వ్యవస్థ అయినా, న్యాయవ్యవస్థ అయినా ప్రతి పౌరుడిని చేరుకోవాలని అభిప్రాయపడ్డారు.”డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువపై దృష్టి పెడుతున్నామన్నారు. దానితో మనం రాజకీయ సమానత్వాన్ని సాధించవచ్చని అన్నారు. సంపద కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుంది. దీనిని మనం అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని సాధించలేం. బార్, బెంచ్ ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్నాయి. రథానికి రెండు చక్రాలు లాంటివి. అవి కలిసి పనిచేయకపోతే న్యాయం జరగదు ” అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవారు వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం వల్లే దేశాభివృద్ధి
- Advertisement -
- Advertisement -