నవతెలంగాణ-హైదరాబాద్: ఆ మధ్య హైదరాబాద్లో చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి తర్వాత ఇంట్లోకి చొరబడి అందినకాడికి దొచ్చుకెళ్లిన ఉదంతాలు అనేకం చూశాం. పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకొని ఈ చెడ్డి గ్యాంగ్ ఆగడాలను కట్టడి చేశారు. అదే తరహాలో ఉత్తరప్రదేశ్ లో దిగంబర ముఠా కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా పలు గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ కొంతమంది పురుషులు, మహిళలపై దాడికి పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
మీరట్ జిల్లా భారాలా గ్రామంలో ఇటీవల ఓ మహిళ ఒంటరిగా కార్యాలయానికి వెళ్తుండగా, నిర్మానుష్య ప్రదేశంలో దిగంబర ముఠాకు చెందిన వ్యక్తులు ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఇదే తరహాలో ఇదివరకే నాలుగు దాడులు జరిగాయని గ్రామస్తులు తెలిపారు.
పలు గ్రామాల్లో ప్రజలు ఈ ముఠాను చూశామని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఎటువంటి అనుమానితులను గుర్తించలేదని, అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.