Saturday, June 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాంట్రాక్టు కార్మికుల తొలగింపు దారుణం

కాంట్రాక్టు కార్మికుల తొలగింపు దారుణం

- Advertisement -

– వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
– ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఆర్‌ఐఎన్‌ఎల్‌ (విశాఖ స్టీల్‌ ప్లాంట్‌) యాజమాన్యం
– పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ జేఏసీ
– సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీనిచ్చిన స్టాండింగ్‌ కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో యాజమాన్యం 5541 కాంట్రాక్టు కార్మికులను అన్యాయంగా తొలగించిందని కార్మిక, టెక్స్‌టైల్స్‌, నైపుణ్యాల అభివృద్ధి శాఖ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ దృష్టికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ జేఏసీ తీసుకెళ్లింది. వారిని విధుల్లో తీసుకునేలా ఆదేశాలిచ్చేలా కృషి చేయాలని కోరింది. గురువారం ఈ మేరకు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్మిక,టెక్స్‌టైల్‌, నైపుణ్యాల అభివృద్ధి శాఖ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌ బసవరాజు బొమ్మరు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నుంచి పలు వినతులను స్వీకరించింది. అందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ జేఏసీ చైర్మెన్లు సీహెచ్‌.నర్సింగరావు(సీఐటీయూ), డి.ఆదినారాయణ(ఏఐటీయూసీ), మంత్రి రాజశేఖర్‌(ఐఎన్‌టీయూసీ)లతో కూడిన బృందం వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఏర్పాటు, అక్కడ జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఆరేండ్లుగా కొత్తగా పర్మినెంట్‌ ఉద్యోగులను నియమించట్లేదనే అంశాన్ని కమిటీ ఎదుట ఎత్తిచూపారు. 35 ఏండ్ల నుంచి విశాఖ ఉక్కు కర్మాగారంలో 13 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు కోర్‌, నాన్‌ కోర్‌ విభాగాల్లో రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారని వివరించారు. అయినా, వారికి వేతనాలు అరకొరగానే దక్కుతున్నాయని ప్రస్తావించారు. రెగ్యులర్‌ ఉద్యోగులు రిటైర్డ్‌ మెంట్‌ అయిన తర్వాత కొత్తగా రిక్రూట్‌మెంట్‌ జరగకపోతుండటంతో ఉన్న కాంట్రాక్టు కార్మికులపై పనిభారం పెరుగుతున్నదని చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను వేధిస్తూ తొలగిస్తున్నదని వాపోయారు. రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌(సెంట్రల్‌) వద్ద జరిగిన కాంట్రాక్టు కార్మిక సంఘాలు, యాజమాన్యం జాయింట్‌ మీటింగ్‌లో వద్ద జరిగిన ఒప్పందాలను సైతం బుట్టదాఖలవుతున్నాయని వాపోయారు. కొందరు కార్మికులను ఇష్టానుసారంగా తొలగిస్తే మిగతా కార్మికులు సమ్మె చేశారనీ, దీంతో కక్షగట్టిన యాజమాన్యం 5541 మంది కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.రి
వారికి కనీసం నోటీసులుగానీ, ముందస్తు సమాచారంగానీ ఇవ్వలేదని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. బయోమెట్రిక్‌లో వారి పేర్లను తీసేసి విధులకు రావొద్దని చెప్పిందని వాపోయారు. కార్మిక చట్టాలను, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను విస్మరించి ఇలా చేస్తారని ప్రశ్నించారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ అంశాన్ని సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్తామని బసవరాజు బొమ్మరు హామీనిచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జేఏసీ నాయకులు ఎన్‌.రమణ, వై.శ్యామ్‌, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలరాజు, సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి నాగన్నగౌడ్‌, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరుకుమార్‌ యాదవ్‌, రాష్ట్ర నాయకులు ఆదిల్‌ షరీఫ్‌, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -