Wednesday, June 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల బకాయిలు విడుదల చేయాలి

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల బకాయిలు విడుదల చేయాలి

- Advertisement -

– ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్‌, టీజీఎస్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్‌, టీజీఎస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిధులు విడుదల కాకపోవడం వల్ల ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రోడ్డున పడ్డారని విమర్శించింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యాలయంలో ఉద్యమ కార్యాచరణపై ఆయా సంఘాల రాష్ట్ర నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరామ్‌ నాయక్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం ద్వారా నడుస్తున్న ఎస్సీ, ఎస్టీ పాఠశాలలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా పాఠశాలను పున:ప్రారంభించాలనీ, విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. దళిత, గిరిజన పేద వర్గాల పిల్లలకు ప్రయివేట్‌ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో బెస్ట్‌ అవైలబుల్‌ పథకం ద్వారా గత అనేక ఏండ్లుగా వేలాదిమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత సకాలంలో బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం వల్ల స్కూళ్లు మూతపడే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాఠశాలల నిర్వహణకు నిధులను కేటాయించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వివిధ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ప్రయివేట్‌ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వం చెల్లించే ఫీజులతో ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేండ్లుగా చెల్లించాల్సిన ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈనెల 20 వరకు పాఠశాలలు తెరిచే పరిస్థితి లేదంటూ స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయని అన్నారు. ఆ యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్చలు జరిపి బకాయి పడ్డ రూ.154 కోట్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రెండేండ్లుగా ఫీజులు చెల్లించకపోవడంతో స్కూళ్ల యాజమాన్యాలపై ఆర్థిక భారం పడుతోందనీ, విద్యార్థులను స్కూళ్లల్లోకి రానీయకుండా కొత్త అడ్మిషన్లు సైతం నిరాకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 180 ప్రయివేటు స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 26 వేల మంది చదువుతున్నారనీ, వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి డే స్కాలర్‌కు రూ.28 వేలు, రెసిడెన్షియల్‌కు రూ.42 వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోందని గుర్తు చేశారు. తక్కువ ఫీజులోనే చదువు, భోజనం, దుస్తులు, పుస్తకాలు, వసతి కల్పి స్తున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా తక్షణం ప్రయివేటు స్కూళ్లకు చెల్లించాల్సిన రూ.154 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే విద్యార్థి, దళిత, గిరిజన, యువజన సంఘాలను ఐక్యం చేసి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ రజినీకాంత్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్‌, అశోక్‌ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -