– ప్రతిఘటించేందుకే జులై 9న దేశవ్యాప్త సమ్మె : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-కంఠేశ్వర్
కార్మికవర్గంపై తీవ్రమవుతున్న దాడిని ప్రతిఘటించేందుకే జులై 9న దేశవ్యాప్త సమ్మె అని, ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సార్వత్రిక సమ్మె బుక్లెట్ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశంలో కార్మికవర్గంపై దాడి తీవ్రమైందని తెలిపారు. దేశంలో సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయని, సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి చేతుల్లోనే సంపద కేంద్రీకరణ కావడమే దీనికి కారణమని చెప్పారు. ఇది దేశంలో సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రేలాపనలు, టారిఫ్ల పెంపులు కూడా పెట్టుబడిదారీ విధాన సంక్షోభంలో భాగమేనని స్పష్టం చేశారు. ఇతర దేశాల సరుకులపై పన్నుల భారం మోపడం ద్వారా తన సంక్షోభాన్ని తప్పించుకునే పనిలో అమెరికా ఉందని అన్నారు. కార్పొరేట్లకు మరిన్ని లాభాలు కట్టబెట్టేందుకే మోడీ సర్కారు లేబర్ కోడ్లను తీసుకురావడానికి కారణమని తెలిపారు. వాటిని ప్రతిఘటించకపోతే దేశ కార్మికోద్యమ ఉనికికే ప్రమాదమని తెలిపారు. ఈనేపథ్యంలో చేసే సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం క్యాంపెయిన్ను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, నాయకులు శంకర్ గౌడ్, జంగం గంగాధర్, నన్నేసాబ్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికవర్గంపై తీవ్రమవుతున్న దాడి
- Advertisement -
- Advertisement -