ఆధునిక ఆఫ్రికన్ అక్షర దిగ్గజం గూగివా దియోంగో (87) మే 28 ఉదయం అమెరికాలో బూపోర్ట్ నగరంలో కన్నుమూశారు. ఆయన 1938లో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆఫ్రికాలో బ్రిటిష్ వలస సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. సమకాలిన ఆఫ్రికన్ రచయితల్లో గూగీ గొప్ప ప్రజా రచయిత. ఆయన కథ, నవల, నాటకం వంటి ప్రధాన ప్రక్రియల ద్వారా ఆరు దశాబ్దాల పాటు ఎన్నో గొప్ప రచనలు చేసి ప్రజలను చైతన్యపరిచాడు. ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన మార్క్సిస్టు రచయిత. ఆయన రచనల ద్వారా బ్రిటిష్ వలస పాలన నుంచి కెన్యాకు స్వాతంత్రం తెచ్చి పెట్టడంలో ప్రధాన పాత్ర వహించాడు. వలస దేశాల్లో ఇంగ్లీష్ భాషను రుద్దడాన్ని ఆయన వ్యతిరేకించేవాడు. దీనిని భాష సామ్రాజ్యవాదం అనేవాడు. ”సామ్రాజ్యవాద వలస దోపిడీ తుపాకీ శరీరాన్ని లొంగదీసుకుంటే, భాష మెదడును వశం చేసుకుంటుంది. భాష, సంస్కృతిపై ఆధిపత్యం ద్వారా ఆర్థిక దోపిడిని, రాజకీయ పెత్తనాన్ని నిరంతరం కొనసాగించాలని వలసవాదులు నిత్యం ప్రణాళికలు రూపొందిస్తారు” అంటూ సామ్రాజ్యవాద దోపిడి గుట్టు విప్పినవాడు గూగి. తన రాజకీయ విశ్వాసాల కారణంగా గూగి కెన్యాలో జైలు జీవితాన్ని ఎదుర్కొన్నాడు. చాలా సంవత్సరాలు బయట దేశాల్లో తలదాచుకున్నాడు. తను జైల్లో ఉన్నప్పుడు టాయిలెట్ టిుష్యూ పేపర్ పై ”Devil on the cross” అనే నవల రాసిన మహా రచయిత. జైలు, దేశ బహిష్కరణ, అనారోగ్యం వంటివి ఆయన కలాన్ని ఆపలేకపోయాయి. గూగి రాసిన ”ది అప్ రైట్ రెవిల్యూషన్” కథానిక 100 భాషల్లోకి అనువదించ బడింది. ఆయనకు భారతదేశంలోని దళిత, బహుజన, వామపక్ష ఉద్యమాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రతో పరిచయం ఉంది. ముఖ్యంగా ఆయన తన దేశ ప్రజల మాతృభాష అయినా ‘గికుయు’ భాషలో రచనలు చేశాడు. దీని ద్వారా ఆయన ప్రజల్లోకి చొచ్చుకొని పోయాడు. తద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజా రచయిత అయ్యాడు. ప్రజాదరణకు మైమరిచి పోయేవాడు. చివరకు తన ప్రజల భాష ‘గికుయు’లోనే ఆయన రచనలు చేశాడు. ఇంగ్లీషు ప్రొఫెసర్గా కెన్యాలోని నైరోబి విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ, కెన్యాలో తెగల సంస్కృతులను పరిరక్షించే పోరాటంలో ఉద్యోగాన్ని, పాలకుల సత్కారాలను తోసి రాజనీ ప్రజల మధ్య, ప్రజల చేత, ప్రజల కొరకు నాటకాలు రాస్తూ, ప్రదర్శిస్తూ పాలకుల ఆగ్రహానికి గురయ్యాడు.
నిర్బంధాల పాలయ్యాడు. మాతృదేశం వదిలి ప్రవాస జీవితం గడిపాడు. గూగి తెలుగు పాఠకులకు సుపరిచితుడు. ఆయన రచనలు తెలుగులో అనువదించబడ్డాయి. భారతీయులు మెచ్చిన మహా రచయిత .ఆయన నవలలు ‘బందీ’, ‘మాటగరి’, ‘ఏడవకు బిడ్డ’ పేరిట తెలుగులోకి అనువాదం అయ్యాయి. ఆయన ఆత్మకథ ‘యుద్ధ కాలంలో స్వప్నాలు- బాల్య జ్ఞాపకాలు’ పేరుతో ఆచార్య జి ఎన్ సాయిబాబా నాగపూర్ జైల్లో ఉన్న సమయంలో అనువదించారు. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో 2018 ఫిబ్రవరి 18న జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభకు గూగి అతిథిగా హాజరై నాడు. గూగి రాసిన ‘పెన్స్ అండ్ గన్స్, డీకాలనైజేషన్ మైండ్స్’ తదితర రచనలు కన్నడ, మలయాళ ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి. గూగి రచనలు చదువుతూ ఉంటే ఆఫ్రికా గురించే కాదు అంతకన్నా మన దేశం గురించి, మన సమాజం గురించి, నేటి ప్రపంచీకరణ కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్నా సమస్యల గురించి మనకి బాగా అర్థం అవుతురది. గత నాలుగు ఐదు వందల ఏండ్లుగా ప్రపంచంలో సంభవిస్తున్న ఆర్థిక, రాజకీయ పరిణామాలు ఆఫ్రికాను ఎలా ప్రభావితం చేసాయో ఆ చారిత్రక క్రమాన్ని గూగి గొప్ప దార్శనికతతో స్పష్టంగా వివరించాడు. యూరప్లో మార్కంటెలిజం ఆఫ్రికన్లను బానిసలుగా, పారిశ్రామిక విప్లవం ఆఫ్రికా ఖండాన్ని కాలనీలుగా మారిస్తే, ఇప్పుడు ప్రపంచీకరణ పెట్టుబడి ఆఫ్రికాను సరికొత్త బానిసత్వంలోకి నెట్టిందని అంటాడు. గూగి గ్లోబల్ పెట్టుబడి మూడో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ధ్వంసం చేసింది అంటాడు. ఒకప్పుడు ఆయుధాలతో, రక్తపాతంతో పాశ్చాత్య దేశాలు ఆఫ్రికాను కొల్లగొట్టాయని, ఇప్పుడు వస్తు సేవల రూపంలో, చౌక కూలీల రూపంలో మళ్ళా కొల్లగొడుతున్నారని వాపోతాడు. ఆయన ఈ మాటలు పరిశీలించి చూస్తే మన దేశానికి కూడా వర్తిస్తాయి.
తమ దేశమే పెద్ద బందిఖానా…. పెద్ద జైలు అయినప్పుడు …ఆ జైలు నుంచి తన దేశం కోసం, ప్రజల కోసం, సంస్కృతి కోసం తపనపడి, కన్న స్వప్నాలు, నెత్తుటితో, కన్నీటితో తడిసిన అతని అక్షరాలతో సామ్రాజ్యవాద దుర్మార్గ పాలన నుంచి తన ప్రజలను ఎలా బయట వేసుకోవాలి అని నిరంతరం తపన పడ్డ ప్రజా మేధావి. తన కలంతో, గళంతో, సాంస్కతిక రంగ అనుభవంతో నిరంతరం కృషి చేసిన కృషీవలుడు నేడు అస్తమించాడు…. ఆయన మరణం ఆఫ్రికా సమాజానికే కాదు, మొత్తం ప్రపంచ పీడిత ప్రజలకు, మొత్తం సాహితీ ప్రపంచానికి, సామ్రాజ్యవాద వ్యతిరేక సాంస్కతిక శిబిరానికి తీర్చలేని లోటు. గూగివా ధివాంగోకి అరుణ… అరుణ …విప్లవ జోహార్లు.
– షేక్. కరీముల్లా , సెల్- 970545070
అస్తమించిన ప్రజా సాహితీ శిఖరం – గూగివా దియోంగో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES