Tuesday, June 17, 2025
E-PAPER

రైతే రాజు

- Advertisement -

– ఆ దిశగానే ప్రజాపాలన
– ఏడు రోజుల్లో రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు
– 18 నెలల్లో రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాం
– రైతుల వల్లే పేదలకు సన్నబియ్యం
– గత ప్రభుత్వం రైతులను మోసం చేసి.. ఇప్పుడు వీధినాటకాలు
– ఎవరెన్ని పన్నాగాలు పన్నినా మనదే ప్రభుత్వం : ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ‘రైతు నేస్తం’లో సీఎం రేవంత్‌ రెడ్డి

పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు
– ఆర్థిక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో రైతు భరోసా ప్రారంభం
– వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో సీఎం మాటామంతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనీ, రాష్ట్ర ఆదాయానికి మూలం వ్యవసాయమని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. పరిశ్రమలకు మాత్రమే సబ్సిడీ విధానంలో భూములు, రాయితీలు ఇవ్వడం కాదని.. వ్యవసాయ రంగంలో సబ్సిడీతో రైతులను ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. తమ ప్రభుత్వం 18 నెలల్లో రైతుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతోపాటు సీఎస్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 1600 రైతు వేదికల నుంచి సుమారు 6 లక్షల మంది రైతులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులు సీఎంతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించారు. రైతులతో మాట ముచ్చట అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రైెతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరన్నారు. వార్డు మెంబర్‌ నుంచి ముఖ్యమంత్రి, పార్లమెంట్‌ సభ్యుల వరకూ రైతుల అండ ఉంటేనే గెలుపు సాధ్యమని తెలిపారు. ఇందిరమ్మ ప్రజాపాలనలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘన కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు ఆధికారంలో ఉండి రెండు దఫాలుగా రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకుని గద్దెనెక్కి రైతులను మోసం చేసిందన్నారు. ప్రజాపాలనలో రైతు సంక్షేమాన్ని చూసి ఓర్వలేక.. వీధి నాటకాలతో బయలుదేరారని విమర్శించారు. పదేండ్ల పాలనలో నాటి ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది ‘నెత్తిమీద అప్పు.. చేతిలో చిప్ప’ అన్నారు. పదేండ్లలో చేసిన విధ్వంసం.. వందేండ్లు అయినా కోలుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. సర్పంచ్‌లకు బిల్లులు, రిటైర్డ్‌ అయిన వారికి బెనిఫిట్స్‌, చివరికి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. దీన్ని చక్కబెట్టడానికి రోజుకు 18గంటలు పనిచేసినా సరిపోవడం లేదన్నారు. వరి సాగు చేస్తే ఉరే అని గత పాలకులు చెబితే.. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రజా ప్రభుత్వం చెబుతోందన్నారు. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రైతులను సన్న వడ్లు పండించాలని ప్రోత్సహించామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ప్రకటించి, రాష్ట్రంలో 60 శాతం పంట దిగుబడిని పెంచినట్టు తెలిపారు. రైతులు పండించిన సన్న వడ్లతోనే ఈ రోజు పేదలకు సన్నబియ్యం అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. వరి పండించడంలో ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానాను దాటి తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందన్నారు.
బీఆర్‌ఎస్‌ చావు రాజకీయం చేస్తోంది
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై రూ.8 లక్షలా 20 వేల కోట్ల అప్పు మోపిపోయిందని సీఎం అన్నారు. అప్పుల కుప్పల నుంచి గట్టేక్కెందుకు తలపానం తోకకు వస్తోందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించేందుకే ఇక్కడికి వచ్చామన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మ గౌరవంతో బతికే పరిస్థితి కల్పించామన్నారు. ఈ విషయంపై ఏ గ్రామంలోనైనా చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ప్రజల, రైతుల, నిరుద్యోగుల చావుల పునాదులపై అధికారంలోకి రావాలని ప్రతిపక్షం దురాలోచన చేస్తోందన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్చ కల్పించామన్నారు. ప్రజలకు కావాల్సింది ఇదే కదా అని అన్నారు. ఎవరెన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేండ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘మీ పని చేసిపెట్టే బాధ్యత నాది.. మీరు వారి పని పట్టండి’ అని సీఎం రైతులకు పిలుపునిచ్చారు. అనంతరం వానాకాలం సీజన్‌ పంట సాగు పెట్టుబడి సాయంలో భాగంగా రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి సుల్తానీయ ఆధ్వర్యంలో సీఎం బటన్‌ నొక్కి రైతు భరోసాను ప్రారంభించారు. 7 రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ కానుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మార్కెటింగ్‌ కమిటీ చైర్మెన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రైతులతో సీఎం మాటా ముచ్చట
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నుంచి రానమ్మ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి రామకృష్ణ, భద్రాద్రి కొత్తగూడం నుంచి బాలు వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల చౌదరపల్లి గ్రామానికి చెందిన వెంకటరామయ్య దంపతులు నేరుగా సీఎంతో ముచ్చటించారు. వెంకటరామయ్య మాట్లాడుతూ.. ‘మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్న సారూ. మాది కరువు ప్రాంతం.. 700 నుంచి 800 అడుగుల బోర్లు వేస్తే ఇంచు నీళ్లు వస్తాయి. కూర గాయలు పండిస్తున్నా.. ఎకరంలో ఆలుగడ్డ సాగుకు రూ.40 వేలు పెట్టు బడి పెడితే.. రూ. లక్ష ఆదాయం వచ్చింది. మాకు డ్రిప్‌ అవకాశం కల్పిం చండి.. కూలీ రేట్లు పెరిగినవి సారూ… వ్యవసాయ పనిముట్లు ఇప్పిస్తే.. భార్యాభర్తలం కష్టపడుతాం సారూ..” అని సీఎంను కోరారు. దీనికి స్పందించిన సీఎం ‘మీరు నేటి తరానికి ఆదర్శం కావాలి.. మీరు మాకందరికీ అర్థం అయ్యేలా స్పష్టంగా సూటిగా మాట్లాడారు.. మిమ్మల్ని చూసి నాతోపాటు.. మా మంత్రి వర్గం కూడా నేర్చుకోవాలి. మీలాంటి ఆదర్శవంతమైన రైతులను తయారు చేయడంలో మీరు కొంత బాధ్యత తీసుకోవాలి’ అని ఆ రైతుకు సీఎం సూచించారు. ‘మా తాతల కాలంలో పండించిన సజ్జలు, జొన్నలు, కొర్రలు, రాగులే.. ఇప్పుడు మిల్లేట్స్‌ పేరుతో కొనుగోలు చేస్తున్నారు. జొన్న రొట్టే తిని.. ఎవరి పని వారు చేసుకుంటే జిమ్ములెందుకని’ విద్యార్థులనుద్దేశించి ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యలు చేశారు.

రెండెకరాల్లోపు రైతు భరోసా నిధులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రైతు భరోసా-2025 వానాకాలం సాయం కింద రెండెకరాల్లోపు రైతులకు సోమవారం ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో ఎకరంలోపున్న 24,22,678 మంది రైతులకు చెందిన 13,54,387.27 లక్షల ఎకరాలను, రెండెకరాల్లోవున్న 17,02,611 మంది రైతులకు చెందిన 25,62,002.04లక్షల ఎకరాలను గుర్తించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఎకరం లోపు రైతులకు రూ.8,12,63,26,111, రెండెకరాల్లోపు రైతులకు రూ. 15,37,20,12,657 మొత్తం రూ. 23,49,83,38,768 నిధులను విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -