Friday, May 30, 2025
E-PAPER
Homeరంగారెడ్డిచేనేతరంగాన్ని ప్రభుత్వం పరిరక్షించాలి

చేనేతరంగాన్ని ప్రభుత్వం పరిరక్షించాలి

- Advertisement -

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం : చెరుపల్లి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్నది చేనేత రంగమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆ రంగం పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చేనేత వృత్తి పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులను కేటాయించడంతోపాటు వృత్తిని ఆధునీకరించి చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు చేనేత రంగాన్ని పరిరక్షించాలనే డిమాండ్‌పై తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సోమవారం మఖ్దూభవన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఎస్సీ సబ్‌ప్లాన్‌ తరహాలో బీసీల అభివృద్ధికి సైతం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తద్వారా కుల వృత్తుల పరిరక్షణకు దోహదపడుతుందనీ, నిధులను కేటాయించి వృత్తులను ఆధునీకరిస్తే వాటిపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని వివరించారు. చేనేత కార్మికులు దీర్ఘ కాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని చెప్పారు. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక దాటేసే ప్రయత్నం చేస్తోందనీ, ఇది మంచిది కాదని విమర్శించారు. ఇలాంటివి చేస్తే భవిష్యత్‌లో అధికారానికి దూరమవుతారని హెచ్చరించారు. చేనేత రంగం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అందుకోసం చేనేత కార్మికులంతా సంఘటితం కావాలన్నారు. సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పాలకులందరూ ఒక్క తాను ముక్కలేనని విమర్శించారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాలు తప్ప వారికి వృత్తితిదారుల సమస్యలను పరిష్కారించాలనే చిత్తశుద్ది లేదన్నారు. రైతాంగం తరహా ఉద్యమాన్ని చేనేత కార్మికులు చేపట్టాల్సిన అవసరముందన్నారు. ఇందుకు రాజకీయాలకు అతీతంగా విశాల వేదిక ఏర్పాటు చేసుకుని ఉద్యమించినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి మాట్లాడుతూ పద్మశాలీలు చట్టసభల్లో అడుగు పెట్టాలన్నారు. అప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. చేనేత రంగ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ జీడీపీలో చేనేత రంగం వాటా ఐదు శాతం ఉందని వివరించారు. కానీ ఈ రంగంపై ఆధారపడిన కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో చేనేత రంగానికి నాబార్డు ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణం ఇచ్చేదనీ, దాన్ని పూర్తిగా నిలిపేయడంతో చేనేత కార్మికులు ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ, ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ పలు తీర్మానాలను ఆమోదించింది. తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు అధ్యక్షతన నిర్వహించిన ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మి నరసయ్య, చేనేత సంఘాల నాయకులు కర్నాటి ధనంజయ, దేవదాసు, రాపోలు జగన్‌, దాసు సురేష్‌, రాపోలు వీర మోహన్‌, ఏశాల అశోక్‌, కోట రాజయ్య, జల్టి రాములు, పెండెం సర్వేశం, చేవూరి ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -