– మనువాదంపై మహోద్యమమే జాషువాకు నివాళి
– కె. ఆనంద చారి, టి స్కైలాబ్ బాబు, భూపతి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-హైదరాబాద్ : వేల ఏండ్లుగా వేళ్లునుకొని ఉన్న కులమత అసమానతలపై అక్షరయుద్ధం చేసి నవయుగ చక్రవర్తి గుర్రం జాషువ అని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ తెలంగాణ సాహితి రాష్ట్ర కన్వీనర్ పి ఆనందచారి,టి పి ఎస్ కె రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. సామాజిక న్యాయాన్ని సమతా భావాన్ని నిర్మించిన మహాకవి గుర్రం జాషువా చిరస్మరణీయుడని వారు తెలిపారు. ఆదివారం గుర్రం జాషువా130వ జయంతి సందర్భంగా కెవిపిఎస్ ,తెలంగాణ సాహితి, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై గల జాషువా విగ్రహం వద్ద సభ నిర్వహించారు. కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎం.కృపాసాగర్ అధ్యక్షత వహించారు. తొలుత జాషువా విగ్రహానికి తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి కె. ఆనందచారి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షలు భూపతి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ సామాజిక సాహిత్య రంగంలో జాషువా కవిత్వం ఓ చైతన్య స్ఫూర్తి అని అన్నారు. కులమత బేధాలు పేదరికం తన గురువుగా భావిస్తున్నానని చెప్పిన జాషువా వాటి మూలాలపై కలం యుద్ధం చేశారని తెలిపారు. కర్మ సిద్ధాంతము పేర కోట్లాదిమంది కష్టజీవులను అణిచివేత దోపిడికి గురిచేసిన మనువాద విష సంస్కృతిపై మహోద్యమం నిర్మించాడని చెప్పారు. పాములకు పాలు పోసి, చీమలకు పంచదార చల్లి మనుషులున్న ఈ జగాన పేదవాడికి గంజి నీళ్లు కూడా ఇవ్వరని తన కవిత్వం ద్వారా నిరసించాడన్నారు.
దేవుని గుడిలోకి ప్రవేశం లేని దళితుల గోడు వినిపించమని గబ్బిలం ద్వారా పంపిన సందేశం ఒక తిరుగుబాటు దారుడు అని చెప్పారు. నేటికి చాలా గ్రామాలలో దళితులకు దేవాలయ ప్రవేశం లేదని, చాతుర్వర్ల వ్యవస్థపై ఆయన తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. నాడు నైజాం నిరంకుశ పాలన కొనసాగుతున్న సందర్భంలోనే దాశరథితో పాటు జాషువా అసమానతలపై తెలంగాణలో యుద్ధం చేస్తున్న వాళ్ళందరూ నా ఆప్తమిత్రులంటూ కమ్యూనిస్టులను కొనియాడారని చెప్పారు.
జాషువా సాహిత్యానికి విరోధిగా ఉన్నవాళ్లు సామాజిక సమానతలకు మూల కారణమైన సిద్ధాంతానికి ప్రతినిధులుగా ఉన్నవాళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నారని తెలిపారు. సామాజిక న్యాయం అంటే అట్టడుగు వర్గాలకు ప్రకృతి వనరులు దక్కడం ద్వారా పీడిత వర్గ ఐక్యత సాధ్యమని చెప్పారు పీడిత వర్గాన్ని దోచుకునే దోపిడీ అసమానతలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో టి పి టి ఎల్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఏ. విజయ్ కుమార్, తెలంగాణ సాహితి రాష్ట్ర నాయకులు అనంతోజు మోహన్ కృష్ణ,ఎస్.కె.సలీమ, శరత్ సుదర్శి, కేవీపీఎస్ గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి బి.సుబ్బారావు, మేడ్చల్ జిల్లా కార్యదర్శులు ఎన్ బాల పీరు, నాయకులు డి. రమేష్ , జి.రాములు, జి.విజయ్ కుమార్, బి.పవన్, సోమయ్య, సురేష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు