– ఇండ్లు లేనివారికి తక్షణమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి : తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
– జలాల్పూర్లో గుడిసెల ప్రాంతం సందర్శన
– 25న తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-భూదాన్పోచంపల్లి
భూదాన్పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో సర్వే నెంబరు 80లోని రెండెకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న 150 మంది పేదలకు తక్షణం పొజిషన్ పట్టాలివ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో ఇండ్లు లేని పేదలు, ఒకే ఇంట్లో ఉన్న రెండూ మూడు కుటుంబాలకు సంబంధించిన వారు సర్వే నెంబరు 80లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. ఆ కుటుంబాలను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం నిర్వహించిన సభలో నాగయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం ఒక్కరికి కూడా సెంటు భూమి పంపిణీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మిగులు భూములు 10 లక్షల ఎకరాలకుపైగా ఉన్నాయని తెలిపారు. ఇల్లు లేని వారందరికీ ఇంటి స్థలం, సాగు భూమికి రెండు ఎకరాల చొప్పున పంపిణీ చేయడానికి అవకాశం ఉందని వివరించారు. జలాల్పూర్ గ్రామంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మాణం చేసివ్వాలని కోరారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ.. జలాల్పూర్ గ్రామంలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వడానికి స్థానిక శాసనసభ్యులు, కలెక్టర్, అధికారులు చొరవ చూపాలని కోరారు. ఈనెల 25న పోచంపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించనున్న మహాధర్నాలో గుడిసెవాసులు, పేదలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) డివిజన్ మాజీ కార్యదర్శి గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, సీఐటీయూ మండల కన్వీనర్ మంచాల మధు, వ్యకాస మండల కార్యదర్శి ప్రసాదం విష్ణు, బీఆర్ఎస్ నాయకులు గోరేటి ప్రదీప్ రెడ్డి, పాలకుర్ల ఆగయ్య పాల్గొన్నారు.
