నవతెలంగాణ-హైదరాబాద్: జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలోని అధికారిక నివాసంలో అగ్నిప్రమాదంలో వెలుగుచూసిన నోట్ల కట్టల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనతో తర్వాత వర్మను ఢిల్లీ నుంచి అలహాబాద్ బదిలీ చేయడం జరిగింది. అంతేకాకుండా రాజీనామా కూడ సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం కోరినా..యశ్వంత్ వర్మ ససేమిరా అన్నారు. దీంతో రానున్న పార్లమెంట్ సమావేశాల్లో జస్టిస్ వర్మపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతామని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఈ వివాదంపై ప్యానెల్ కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు భారీగా వెలుగుచూసిన విషయం వాస్తవమేనని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నిర్థారించింది. దీనిపై ప్యానెల్ తాజాగా 60 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ సొమ్ములున్న స్టోరూమ్ నియంత్రణ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జస్టిస్ వర్మ లేదా అతని కుటుంబసభ్యుల అధీనంలోనే ఉందని అభిప్రాయపడింది. దీనికి సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నట్లు వెల్లడించింది. అక్కడ అగ్నిప్రమాదంలో దగ్ధమైన నోట్లను మార్చి 15వ తేదీ తెల్లవారుజామున అక్కడినుంచి తొలగించడమే దీనికి బలమైన సాక్ష్యమని వెల్లడించింది. అసలు ఈ నోట్లను జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబసభ్యుల స్టోరూమ్లో ఉంచడం అనుమానాస్పదంగా ఉందని అభిప్రాయపడింది.