నవతెలంగాణ – హైదరాబాద్ : మూవీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు ఆ ముఠాకు చెందిన మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అయితే, నిందితుల అరెస్ట్పై ఇవాళ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలను బయటపెట్టారు.
ఈ ముఠా సభ్యులు తెలుగు, హిందీ, తమిళం సహా అనేక భాషల సినిమాలను రిలీజ్ అయిన రోజే థియేటర్లలో రికార్డు చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈ పైరసీ వల్ల ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం జరిగినట్లు తెలిపారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం… ‘ఈ పైరసీ గ్యాంగ్ చాలా కాలంగా యాక్టివ్గా ఉంది. ముఠా సభ్యులు చాలా కాలంగా సినిమాలను సీక్రెట్గా థియేటర్లలో హిడెన్ కెమెరా ద్వారా రికార్డ్ చేసి వాటిని టెలిగ్రామ్, ప్రోటాన్ మెయిల్ వంటి ప్లాట్ ఫామ్స్లో అప్లోడ్ చేసే వారు. అరెస్టైన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్, పరిసర ప్రాంతాల వారే. వారి నుంచి ల్యాప్టాప్స్, హార్డ్ డిస్కులు, ఇంటర్నెట్ డివైస్లు, ఇతర సాంకేతిక సామగ్రి స్వాధీనం చేసుకున్నాం.’ అని చెప్పారు.
గత 18 నెలల్లో ఈ నెట్వర్క్ 40కి పైగా తెలుగు సినిమాలను లీక్ చేసినట్లు చెప్పారు పోలీసులు. ‘థియేటర్లో రిలీజ్ కాగానే అవి అక్రమ వెబ్ సైట్లలోకి అందుబాటులోకి వచ్చేవి. ఈ ముఠా అంతర్జాతీయ పైరసీ ప్లాట్ ఫాంలతో ‘1TamilMV’ వంటి వెబ్సైట్లతో కూడా సంబంధం కలిగి ఉంది. వారి క్రిప్టో వాలెట్ ట్రాన్సాక్షన్స్ ట్రాక్ చేసి లొకేషన్ను ట్రేస్ చేశాం.’ అని వెల్లడించారు.